చంద్రబాబు బాత్రూమ్‌ల నిధులు దోచేశాడు

10 Dec, 2020 05:03 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

అనంతపురం (టవర్‌ క్లాక్‌):  చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం రూ.40 వేల కోట్లు కేటాయిస్తే ఆయన ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, పైగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద హౌసింగ్‌ బాత్రూమ్‌ల నిధులు కూడా దోచేశాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బుధవారం అనంతపురంలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారీ్టలో ఎవరు కష్టపడితే వారికి రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అంతకుముందు హిందూపురంలో విలేకరులతో మాట్లాడారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ సముచిత గౌరవం ఇస్తుందని, అన్ని ఎన్నికల్లోనూ కలిసే పనిచేస్తామన్నారు. తిరుపతి ఉప ఎన్నికలోనూ బీజేపీ, జనసేన ఏక నిర్ణయంతో అభ్యర్థిని ఎంపిక చేసి పోటీలో నిలుపుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని, దీనిపై చర్చ చేయాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం తెస్తున్న వ్యవసాయ చట్టాలు ఎంతో అమోఘమైనవని, ఇవి రైతులకు మేలు చేసేవే తప్ప కీడు చేసేవి కావన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నది తమ అభిప్రాయమన్నారు.  

మరిన్ని వార్తలు