ప్యాకేజీకి అంగీకరించిన మీరే ఇప్పుడు హోదా అడుగుతారా

28 Jul, 2022 04:58 IST|Sakshi

టీడీపీ నేతలపై సోము వీర్రాజు మండిపాటు  

సాక్షి, అమరావతి:  రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో చంద్రబాబే కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వల్లే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పడంతో పాటు కేంద్రం ఇచ్చిన రూ. 7,798 కోట్లు తీసుకొని కేంద్రానికీ, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు లేఖ కూడా రాశారని తెలిపారు. ఇప్పుడు టీడీపీ నేతలు తమ రాజకీయ ఉనికి కోసం పార్లమెంట్‌లోనూ, బయటా హోదా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా  వీర్రాజు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పేరు చెప్పి రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా కొందరు రాజకీయ కుట్రలకు తెర తీస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వంద శాతం ఆత్మీయ కౌగిలిలో ఉన్నారని ఆరోపించారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీకి అవకాశం ఉందన్నారు. జనసేనతో కలసి మిత్రపక్షంగా ముందుకు సాగుతామన్నారు.     

మరిన్ని వార్తలు