అసమ్మతి నేతలతో ముగిసిన సోనియా భేటీ

19 Dec, 2020 16:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసమ్మతి నేతలతో జరిపిన భేటీ నేటికి ముగిసింది. దాదాపు 5 గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ సమావేశంలో 19 మంది నాయకుల అభిప్రాయాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఇక పార్టీని బలోపేతం చేసే అంశాలపై ఎంపీ రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ క్రమంలో రాహుల్‌  నాయకత్వంపై తమకు అభ్యంతరం లేదని అసమ్మతి నేతలు వెల్లడించినట్లు సమాచారం. అదే విధంగా.. వివిధ రాష్ట్రాలలో పార్టీ పరిస్థితులపై కూడా చర్చించారు. పీసీసీల నాయకత్వ మార్పు, పార్టీ సంస్థాగత ఎన్నికల తదితర అంశాలపై కూలంకుశంగా చర్చించారు. ఇదిలా ఉండగా... చింతన్ శిబిర్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి చర్చ జరపాలని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు.(చదవండి: అసమ్మతి నేతలతో సోనియా భేటీ)

పార్టీ ఒక పెద్ద కుటుంబం
భేటీ అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌ మాట్లాడుతూ.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం అని, నాయకులంతా అందులో సభ్యులేనని సోనియాగాంధీ అన్నట్లు పేర్కొన్నారు. ‘‘దేశవ్యాప్తంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి. త్వరలో జరగబోయే సంస్థాగత ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు