ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా

24 Aug, 2020 12:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోనియా గాంధీ అన్నంత పని చేశారు. గ‌త కొన్ని రోజులు వ‌స్తున్న ఊహాగానాల‌ను నిజం చేస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు. సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు. (చదవండి : కొనసాగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం)

సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్‌ చదివి వినిపించారు. కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్లో సోనియా గాంధీ కొన‌సాగాల‌ని మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌తిపాదించారు. అయితే, కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా కొన‌సాగే ఆస‌క్తి త‌న‌కు లేద‌ని సోనియా గాంధీ సీడ‌బ్లూసీ స‌భ్యుల‌కు స్ప‌ష్టం చేశారు. ఈ ప‌ద‌వికి మ‌రొక‌రిని ఎన్నుకోవాల‌ని ఆమె సూచించారు.దీంతో పార్టీ కొత్త అధ్య‌క్షుడి ఎంపీక కోసం కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యులు చ‌ర్చలు జ‌రుపుతున్నారు. (చదవండి : కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు!)

మరోవైపు కాంగ్రెస్‌లో సమూల మార్పులు చేయాలని కోరుతూ 23 మంది నేతలు పార్టీ నాయకత్వానికి లేఖ రాయడంపై రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాంటి లేఖ రాయడానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సోనియాగాంధీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఈ రకమైన లేఖను ఎలా రాస్తారని ఆయన ప్రశ్నించారు. రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ సంక్షోభం సమంలో లేఖలు రాయడం సరికాదన్నారు. సోనియా అధ్యక్ష పదవిలో కొనసాగాలన్న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ల లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందని రాహుల్‌ అనుమానం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు