Sonu Sood: నా సోదరి పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేయనుంది

14 Nov, 2021 13:45 IST|Sakshi

చంఢీఘర్‌: కరోనా కష్ట కాలంలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఆపన్నులను ఆదుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో రైతులు, కూలీల కోసం ట్రైన్లు, బస్సులు ఏర్పాటు చేసి మరీ వారిని ఊర్లకు చేర్చారు. ఇప్పటికీ కూడా సోనూసూద్‌ తన ఫౌండేషన్‌ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇప్పటివరకు సోనూసూద్‌ స్వయంగా స్పందించలేదు. కానీ తాజాగా సోనూసూద్‌ తన సోదరి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. సోనూసూద్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరి మాళవిక సూద్‌ వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.

చదవండి: అఖిలేశ్‌పై అమిత్‌ షా మాటల దాడి

అయితే ఆమె ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఇక సోనూ ఇటీవల పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ చన్నీతో భేటీ అయ్యారు. అదేవిధంగా సోనూసూద్‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కూడా సమావేశం అయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ‘దేశ్‌ కా మెంటర్స్‌’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు సోనూసూద్‌ పేర్కొన్నారు. అయితే ఆయన పలు పార్టీ నేతలు, సీఎంలను కలిసినప్పటికీ ప్రధానంగా తన ఫౌండేషన్‌కు రాజకీయలతో సంబంధం లేదన్నారు.

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ కావటం వల్ల ఆప్‌ తరఫున సోనూసూద్‌ పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తమ మధ్య రాజకీయాలు చర్చకురాలేదని సోనూసూద్‌ స్పష్టం చేశారు. అయితే తాజాగా సోనూ తన సోదరి పంజాబ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించడంతో.. ఆమె ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారన్నది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు