Maharashtra Political Crisis: ఆత్మల్ని చంపేసుకున్నారు.. ఉత్త దేహాలే తిరిగొస్తాయ్‌! వై ఫ్లస్‌ భద్రత లిస్ట్‌లో షిండే నో

27 Jun, 2022 07:56 IST|Sakshi

ముంబై: మహా రాజకీయ సంక్షోభం.. సాగదీతతో ఇంకా కొనసాగుతూనే ఉంది. గువాహతి హోటల్‌లోనే మకాం వేసిన ఏక్‌నాథ్‌ షిండే వర్గం.. మరికొందరు శివసేన అసంతృప్తులను సమీకరించే పనిలో ఉంది. మరోవైపు రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సీఎం ఉద్దవ్‌ థాక్రే.. అసెంబ్లీలోనే బలనిరూపణకు పట్టుబడతుంది. ఈ క్రమంలో.. 

సుప్రీం కోర్టుకు మహా పంచాయితీ చేరుకుంది. అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా ఏక్‌నాథ్‌ షిండే దాఖలు చేసిన పిటిషన్‌పై వెకేషన్‌ బెంచ్‌ ఇవాళ(సోమవారం) విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. రెబల్స్‌ ఇళ్లు, కార్యాలయాలపై శివ సైనికుల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం భద్రత కల్పించింది. పదిహేను మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు వై ఫ్లస్‌ సెక్యూరిటీ ఇచ్చింది. అయితే ఆ లిస్ట్‌లో ఏక్‌నాథ్‌ షిండే పేరు లేకపోవడం గమనార్హం.  

మరోవైపు శివసేన కీలక నేత సంజయ్ రౌత్, సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారి ఆత్మలు చనిపోయాయని, వారి ఉత్త దేహాలు మాత్రమే ముంబైకి తిరిగి వస్తాయని ఆదివారం అన్నారు.

ఆ నలభై మంది రెబల్‌ ఎమ్మెల్యేలు.. బతికి లేరు. తమ చేష్టలతో వాళ్లు వాళ్ల వాళ్ల ఆత్మలను చంపేసుకున్నారు. కేవలం వాళ్ల ఉత్తదేహాలు మాత్రమే మహారాష్ట్రకు తిరిగి వస్తాయి. గువాహతి నుంచి బయటకు అడుగుపెట్టగా.. మనస్ఫూర్తిగా వాళ్లను వాల్లు చంపేసుకున్నట్లే లెక్క. ఆత్మలు లేని వాళ్ల దేహాలు.. పోస్ట్‌మార్టం కోసం వాళ్లను నేరుగా అసెంబ్లీకి పంపడమే మిగిలింది అని రౌత్‌ వ్యాఖ్యానించారు. 

ప్రలోభాలు, అధికార దాహంతోనే ఈ వేరుకుంపటి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజుకున్న నిప్పుతో ఏం జరుగుతుందో వాళ్లకు తిరిగొచ్చాక తెలుస్తుందని. అని సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు. ‘వాళ్లు ఇక్కడికి వస్తే.. అసలు తిరుగుబాటు ఎక్కడి మొదలైందో స్పష్టత వస్తుంది. వాళ్లు ఏం కోల్పోతున్నారో వాళ్లకు అర్థం అవుతుంది. నిజమైన సైనికుల తీరు ఇది కాదు. అధికారం కోల్పోయే ప్రసక్తే లేదు.. శివ సేన పోరాటం కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు ఎంపీ సంజయ్‌ రౌత్‌.

చదవండి: రంగంలోకి గవర్నర్‌.. మహాలో రాష్ట్రపతి పాలన తప్పదా?

మరిన్ని వార్తలు