కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి 

22 Mar, 2023 02:33 IST|Sakshi

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌  

కేసీఆర్‌ను ఎదుర్కోలేకే.. ఈ కక్ష సాధింపు 

కొందరు ఇష్టమొచ్చి నట్లు మాట్లాడి పైశాచికానందం పొందుతున్నారు..    

ఆధారాలు సృష్టించి అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని ధ్వజం 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత సెల్‌ఫోన్లను ధ్వంసం చేశారని గతంలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉపసంహరించుకోవాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నా రు. ఈడీ విచారణలో భాగంగా తాను గతంలో ఉపయోగించిన 10 సెల్‌ఫోన్లను మంగళవారం కవిత అధికారులకు సమ ర్పిం చినందున... కిషన్‌రెడ్డి కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్‌రెడ్డి ఎలాంటి ఆధారాలతో ఆరోపణలు చేశారని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస్‌ గౌడ్‌ మంగళవారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కిషన్‌రెడ్డి ఏ ఆధారాలు లేకుండా ఊహించుకొని అబద్ధాలతో ఒక మహిళ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరన్న విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.  

తెలంగాణ ఆడబిడ్డపై కక్ష సాధింపు: సీఎం కేసీఆర్‌ను, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక తెలంగాణ ఆడబిడ్డ కవితపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. దేశంలో లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకొని విదేశాలకు పారిపోయిన అవినీతిపరులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టుకోవట్లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అంతేగాక లక్షల కోట్లు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టి ఉల్లిగడ్డపై పొట్టు లాంటి రూ.100 కోట్ల స్కామ్‌ అనే పేరుతో లేని అధారాలను సృష్టించి కవితను వేధిస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్ని స్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం వచ్చినప్పటి నుంచి కొందరు అనవసర వ్యాఖ్యలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలపాటు విచారణ చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కేంద్రంలోని బీజేపీ గుర్తుంచుకోవాలని, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు. మాటిమాటికి సౌత్‌గ్రూప్‌ అనే పేరుతో దక్షిణ భారతదేశాన్ని, తెలంగాణ మహిళలను కేంద్ర ప్రభుత్వం బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా పనిచేసే దర్యాప్తు సంస్థలను, అధికారులను తమకు అనుకూలంగా పనిచేయాలని చెప్పడం దేశానికే అరిష్టమన్నారు.   

మరిన్ని వార్తలు