‘ఆడబిడ్డపై మీ ప్రతాపమా?.. లలిత్‌మోదీ, విజయ్‌ మాల్యా ఎక్కడున్నారు’

21 Mar, 2023 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ: సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ధ్వంసం చేయని ఫోన్లను చేశారంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు ఆమమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెలలో కవితను ఈడీ విచారణకు పిలిచింది. కానీ ఫోన్లు ధ్వంసం చేశారని నవంబర్‌లోనే ప్రచారం చేశారని విమర్శించారు.

ఆడబిడ్డపై మీ ప్రతాపమా? అని మంత్రి  ధ్వజమెత్తారు. ఇది వందకోట్ల స్కామ్‌ అయితే.. మీ నీరవ్‌ మోదీ ఎన్నికోట్ల స్కామ్‌ చేశారు? లలిత్‌మోదీ, విజయ్‌ మాల్యా ఎక్కడున్నారని ప్రశ్నించారు.  లక్షల కోట్ల స్కాంలు వదిలేసి వందకోట్ల కేసు వెంటపడుతున్నారని అని దుయ్యబట్టారు. ఒక మహిళ అని చూడకుండా కవితను 10 రోజులుగా వేధిస్తున్నారని విమర్శించారు. లేని ఆధారాలు ఉన్నట్లు సృష్టించి వేధిస్తున్నారని.. కవితకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘కవిత ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్‌రెడ్డి ఎలా మాట్లాడతారు. ఒక మహిళ గురించి ఆరోపణలు చేసేటప్పుడు బాధ్యత ఉండాలి. ఎలాంటి ఆధారాలంతో కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు?. ఫోన్లను ధ్వంసం చేయలేదని కవిత గతంలోనే చెప్పారు. నోటీసులు ఇవ్వకముందే ఫోన్ల ధ్వంసం గురించి ప్రచారం మొదలు పెట్టారు. కవిత ఫోన్లు భద్రంగా ఉన్నాయి. ఇవాళ వాటిని ఆమె ఈడీకి సమర్పించారు’ అని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు