ఉద్దవ్‌కు ఊరట.. షిండే వర్గానికి గుర్తింపు ఇవ్వొద్దు.. ఈసీకి సుప్రీం ఆదేశం

4 Aug, 2022 14:49 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టు ‘శివ సేన’ పంచాయితీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే వర్గానికి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఏక్‌నాథ్‌ షిండే దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా ఆయన వర్గానికి అసలైన శివ సేన గుర్తింపు ఇవ్వరాదని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

అంతేకాదు సోమవారం(ఆగస్టు 8వ తేదీన)  ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు రాజ్యాంగబద్ధమైన బెంచ్‌కు సిఫార్సు చేయాలా? వద్దా? అనే విషయంపై సుప్రీం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపింది. గురువారం వాదనల సందర్భంగా సీజే ఎన్వీ రమణ.. షిండే వర్గాన్ని ఉద్దేశించి ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు. ‘‘మీరు ఎన్నికైన తర్వాత రాజకీయ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా?’’ అని తెలుసుకోవాలని ఉందని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ అడ్వొకేట్‌ హరీష్‌ సాల్వేను ఉద్దేశించి సీజే ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి ‘లేదు’ అనే సమాధానం వచ్చింది.

రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం తేలేవరకు ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని ఉద్దవ్‌ థాక్రే వర్గం.. సుప్రీంను అభ్యర్థించింది. అయితే రాజ్యాంగబద్దమైన ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున తమనే అసలైన వర్గంగా గుర్తించాలని, ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని షిండే వర్గం సుప్రీంలో వాదన వినిపించింది. ఈ తరుణంలో షిండే గ్రూప్‌ పిటిషన్‌పై ప్రతికూలంగా స్పందించిన బెంచ్‌.. శివ సేన నియంత్రణను షిండే వర్గానికి అప్పగించ్చొద్దంటూ ఈసీకి సూచించింది.

ఎవరిది అసలైన శివ సేన తేల్చేందుకు అగస్టు 8వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇది వరకే ఇరువర్గాలను ఆదేశించింది కూడా.

ఇదీ చదవండి: ఇది మమత మార్క్‌ రాజకీయం! 

మరిన్ని వార్తలు