సువేందును భయపెడుతున్న ఆ 24 మంది..

15 Jun, 2021 12:18 IST|Sakshi

ముకుల్‌ రాయ్‌ బాటలో మరికొందరు ఎమ్మెల్యే

గవర్నర్‌-సువేందుల భేటీకి 24 మంది ఎమ్మెల్యేలు డుమ్మా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కాషాయ పార్టీకి షాకుల మీద షాకుల తగులుతున్నాయి. బీజేపీ తరఫున గెలిచిన ముకుల్‌ రాయ్‌ తృణమూల్‌ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలో మరి కొందరు పయణించే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరు తమతోనే ఉన్నారని నిరూపించుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు గండి పడింది. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి, గవర్నర్‌ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఈ సంఘటనతో మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి తిరుగుపయనం కానున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. 

సువేందు అధికారి సోమవారం సాయంత్రం గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనుచిత సంఘటనలు, వాటి పరిణామాలతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. దాంతో వారంతా తిరిగి టీఎంసీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీలోకి వచ్చిన సువేందుకు ప్రతిపక్ష నేత పదవి కట్టబెట్టడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలకపోతున్నారు. సువేందు నాయకత్వాన్ని అంగీకరించడానికి వారు సుముఖంగా లేరు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే ముకుల్‌ రాయ్‌ టీఎంసీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరికొందరు బీజేపీని వీడి తృణమూల్‌లో చేరతారని భావిస్తున్నారు. 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ టీఎంసీ ప్రకటించడం గమనార్హం. 

చదవండి: ముకుల్‌రాయ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

మరిన్ని వార్తలు