బీజేపీలో లక్ష్యం నెరవేరలేదు.. అందుకే తిరిగి టీఆర్‌ఎస్‍లోకి.. అంతా కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు..

21 Oct, 2022 17:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వీరికి కుండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వామిగౌడ్ వీరిచిత పోరాటం చేశారని కేటీఆర్ కొనియాడారు. దాసోజ్ శ్రవణ్ సెల్ఫేమేడ్ లీడర్ అని ప్రశంసించారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతిబిడ్డ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కీసీఆర్‌ పిలుపుతోనే ఉద్యమంలో కసితో పనిచేశామని తెలిపారు. ఉద్యమ సమయంలో ఉద్యోగ గర్జన ప్రారంభమైంది ఈ రోజే(అక్టోబర్‌ 21) అని గుర్తు చేశారు. అదే తేదీన మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు.

విభజన సమస్యల పరిష్కారం కోసమే తాను గతంలో బీజేపీలో చేరానని స్వామిగౌడ్ పేర్కొన్నారు. సమస్యలపై కేంద్రంలో పెద్దలకు చాలాసార్లు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. కానీ తాను బీజేపీలో చేరిన ఆశయం నెరవేరలేదని, అందుకే తిరిగి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు.

దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. 8 ఏళ్ల తర్వాత తిరిగి టీఆర్ఎస్ గూటికే రావడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ చేయి పట్టుకుని తెలంగాణ ఉద్యమ గొంతుకగా పనిచేశానని పేర్కొన్నారు. దేశానికే తలమానికంగా తెలంగాణను కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. బీజేపీలో కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులకే ప్రాధాన్యం ఉందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు ఆ పార్టీలో స్థానం లేదని విమర్శించారు.
చదవండి: బీజేపీకి మరో షాక్.. స్వామిగౌడ్ రాజీనామా.. టీఆర్‌ఎస్‌లో చేరిక

>
మరిన్ని వార్తలు