భారీ వర్షాలు కురిస్తే రూపాయి కూడా ఇవ్వలేదు

5 Nov, 2020 14:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తే కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను బిహార్‌కు ఇస్తా అంటున్నారని.. మోదీ ప్రధానమంత్రి దేశానికా? లేక బిహార్‌కా ? అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యాక బడుగు బలహీన వర్గాల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న విధంగా బీసీలకు సంక్షేమ పథకాలు ఎక్కడా ఇవ్వడం లేదు. ఏ ఎన్నిక అయినా బీసీలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉంటుంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీ భవన్ ముందు చేసిన ధర్నాలను ఎవ్వరూ మర్చిపోలేదు. ( సీఎం దత్తత గ్రామాల్లో పెండింగ్‌ పనులు )

విద్య - ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎవ్వరూ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల వర్గాలకు తప్ప బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మేమే తీర్మానం చేసి పంపాము. దుబ్బాకలో ప్రతిపక్షాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రేపు 10వ తేదీన ఫలితాలను ప్రజలు చూడాలి. కేం‍ద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడుతారు కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి మాట్లాడరు.  వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు ఉన్నారా?’’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు