సాక్షి, కవాడిగూడ: త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్పొరేటర్పై ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం లోయర్ ట్యాంక్ బండ్లోని పింగళి వెంకట్రామయ్య ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి కార్పొరేటర్ తమ తమ డివిజన్పరిధిలో ఉన్న గ్రాడ్యుయేట్లను గుర్తించి వారు ఓటరుగా నమోదు చేయించుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున కార్పొరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో ప్రతి కార్పొరేటర్ ఎంతో శ్రమించారని, ప్రజల ఇబ్బందులను గుర్తించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. కార్పొరేటర్లు తమ డివిజన్లలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేదా తన దృష్టికి తెచ్చినా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇంకా ఏమన్నారంటే..
ఎన్నికల కసరత్తు షురూ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. కరోనాతో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలా లేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ల ద్వారా నిర్వహించాలా ..అన్న అంశంపై అభిప్రాయం చెప్పాలని ప్రధాన రాజకీయ పక్షాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సోమవారం లేఖలు రాశారు. ఈ నెలాఖరులోపు తమ అభిప్రాయాన్ని చెబితే.. మెజారిటీ అభిప్రాయం మేరకు ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఎన్నికలు ఇప్పటి వరకు బ్యాలెట్ పద్ధతినే నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించే యోచనలో ఉన్నారు.