తమిళనాడులో తగ్గుతున్న మహిళా ప్రాతినిథ్యం

4 May, 2021 08:09 IST|Sakshi
గీతా జీవన్‌ (డీఎంకే), మరగదం కుమరవేల్‌ (అన్నాడీఎంకే), వానతీ శ్రీనివాసన్‌ (బీజేపీ), విజయధారణి (కాంగ్రెస్‌)

అసెంబ్లీకి క్రమంగా దూరమవుతున్న మహిళా ప్రజాప్రతినిధులు 

తాజా ఫలితాల్లో 12 మంది గెలుపు 

సాక్షి, చెన్నై: అసెంబ్లీకి మహిళల ప్రాతినిథ్యం క్రమంగా తగ్గుతోంది. ఈ దఫా ఎన్నికల్లో 12 మంది మహిళలు మాత్రమే గెలుపొందారు. ఇందులో డీఎంకే పార్టీ నుంచి 6, అన్నాడీఎంకే నుంచి 3, బీజేపీ నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీకి 1957 నుంచి మహిళల ప్రాతినిథ్యం ఉంటూ వస్తోంది. పది మందికి తగ్గుకుండా గెలుపొందేవారు.

1991లో అత్యధికంగా 32 మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2001లో 25 మంది, 2006లో 22 మంది అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 2011లో 17 మంది, 2016లో 21 మంది గెలిచారు. అయితే తాజాగా ఆ సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సహా అన్ని పార్టీల నుంచి మొత్తం 411 మంది మహిళలు బరిలోకి దిగారు. వీరిలో కేవలం 12 మంది మాత్రమే గెలుపొందారు.

12 మంది మహిళలు 
ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన వారిలో డీఎంకే నుంచి వరలక్ష్మి మదుసూదన్‌ (చెంగల్పట్టు), అమ్ములు (గుడియాత్తం), గీతా జీవన్‌(తూత్తుకుడి), కయల్వెలి సెల్వరాజ్‌( తారాపురం), శివగామ సుందరి(కృష్ణరాయపురం), తమిళరసి (మానామదురై)లు ఉన్నారు. ఇక అన్నాడీఎంకే నుంచి మరగదం కుమరవేల్‌ ( మదురాంతకం),  చిత్ర ( ఏర్కాడు), తేన్‌మొళి (నీలకోటై) గెలిచారు. బీజేపీ నుంచి సరస్వతి (మోడకురిచ్చి), వానతీ శ్రీనివాసన్‌ (కోవై దక్షిణం), కాంగ్రెస్‌ నుంచి విజయథారణి (విలవన్‌ కోడ్‌) నుంచి గెలుపొందారు. డీఎంకే నుంచి విజయం సాధించిన గీతా జీవన్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. 
చదవండి: ఎన్నికలు ఫలితాలు.. రణరంగాన్ని తలపిస్తున్న వెస్ట్‌ బెంగాల్‌

మరిన్ని వార్తలు