Tamil Nadu: పార్టీ బలోపేతానికి కమల్‌ హాసన్‌ కీలక నిర్ణయం

11 Mar, 2022 17:12 IST|Sakshi

సాక్షి, చెన్నై: మక్కల్‌ నీది మయ్యంను బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర పర్యటనకు విశ్వనటుడు కమల్‌ సిద్ధమవుతున్నారు. ఇందుకు తగ్గ రూట్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందుగా విశ్వనటుడు కమల హాసన్‌ నేతృత్వంలో మక్కల్‌ నీది మయ్యం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా తమకంటూ ఓటు బ్యాంక్‌ ఉందని కమల్‌ చాటుకున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. కమలహాసన్‌ సైతం ఓటమి పాలయ్యారు.

అలాగే, ఇటీవలి నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి నిరాశే మిగిలింది. దీంతో పార్టీని సంస్థాగత స్థాయి నుంచి బలోపేతం చేసి, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల్‌ నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర పర్యటనకు రెడీ అవుతున్నారు. కమల్‌ తన పర్యటనలో ప్రజాగళాన్ని తన గళంగా వినిపించే విధంగా ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఆయా గ్రామాలు, పట్ట ణాలు, నగరాల్లోని పార్టీ వర్గాల ద్వారా స్థానిక సమస్యలపై అధ్యయానికి నిర్ణయించారు.

దీంతో రేషన్‌ దుకాణాలు, గ్రామీణ ప్రజలు ఏకమయ్యే రచ్చ బండల వద్దకు చేరుకుని స్థానిక సమస్యలను తెలుసుకునే పనిలో మక్కల్‌ నీది మయ్యం వర్గా లు నిమగ్నమయ్యాయి. ఇప్పటి నుంచే ప్రజల్లో మమేకమయ్యే విధంగా కమల్‌ కార్యక్రమాలు ఉంటాయని, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి బలమైన పార్టీగా తీర్చిదిద్దుతామని నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు