AIADMK: నువ్వా.. నేనా?

10 Aug, 2021 07:25 IST|Sakshi

‘ప్రిసీడియం’ చైర్మన్‌ పదవికి అన్నాడీఎంకేలో కుస్తీ 

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో కీలకమైన ప్రిసీడియం చైర్మన్‌ పోస్టును చేజిక్కించుకునేందుకు నేతలు ఆపార్టీ నేతలు నువ్వా.. నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. రేసులో మొత్తం ఏడుగురు నేతలు ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం ముగ్గురి మధ్య ఉంది. ఇప్పటి వరకు వళ్లి ముత్తు, నావలన్‌ నెడుంజెలియన్, పొన్నయ్యన్, పుదుమై పిత్తన్, కాళి ముత్తు, మధుసూదనన్‌ వంటి నేతలు ప్రిసీడియం చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో మధుసూదనన్‌ ఒకటిన్నర దశాబ్దం ఆ పదవిలో కొనసాగారు. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన మరణించారు. దీంతో ఈ పదవిపై సీనియర్ల దృష్టి పడింది. ప్రస్తుతం అన్నాడీఎంకేలో సమన్వయ కమిటీ కీలకంగా ఉన్నప్పటికీ, కోర్టుల్లో పార్టీ పరంగా ఉన్న వ్యవహారాల్ని ఎదుర్కొనడం, ఎన్నికల కమిషన్‌తో ముడిపడిన అంశాలన్నీ ప్రిసీడియం చైర్మన్‌ గుప్పెట్లోనే ఉంటాయి. 

ప్రధాన పోటీ వారిమధ్యేనా? 
ఎన్నికల్లో ఓటమి తర్వాత పదవులు లేకుండా ఖాళీగా ఉన్న సీనియర్లు ఈ పదవి కోసం తీవ్రంగానే పావులు కదుపుతున్నారు. సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో కన్వీనర్‌ పళనిస్వామికి సన్నిహితంగా ఉన్న నేతలు ఆశావహుల జాబితాలో ఉన్నారు. జేసీడీ ప్రభాకర్, తమిళ్‌ మగన్‌ హుస్సేన్, సయ్యద్‌ ఖాన్, అన్వర్‌ రాజా, అరుణాచలం, వేనుగోపాల్, ధనపాల్‌ రేసులో ఉన్నారు. అయితే ధనపాల్, అన్వర్‌ రాజా, తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు భావిస్తున్నారు.

అన్వర్, హుస్సేన్‌ మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన నేతలు. వీరిలో ఒకరికి పదవి కట్టబెడితే.. మరొకరు వ్యతిరేకించే అవకాశం ఉంది. ధనపాల్‌ వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాగా మధుసూదనన్‌ దివంగత అమ్మ జయలలిత మెచ్చిన ప్రిసీడియం చైర్మనే కాదు,  పన్నీరుసెల్వం మద్దతు దారుడు కూడా. దీంతో ఈసారి కూడా తన వర్గీయులకే ఆ పదవి కట్టబెట్టేందుకు పన్నీరు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం.  

చదవండి: Tamilnadu: రూ.7 వేల కోట్ల భారం.. అందుకే 60 ఏళ్లకే రిటైర్మెంట్‌

మరిన్ని వార్తలు