పారని సైకిల్, గ్లాస్‌ పాచిక

15 Mar, 2021 04:46 IST|Sakshi

కర్నూలు జిల్లాలో ఇరుపార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం.. తిప్పికొట్టిన ప్రజలు

జిల్లాలో 23 వార్డులకే టీడీపీ పరిమితం.. జనసేన పూర్తిగా గల్లంతు

కర్నూలు(టౌన్‌): మున్సిపల్‌ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఎలాగైనా గెలవాలన్న కుయుక్తులతో తెలుగుదేశం పార్టీ.. జనసేనలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లా ప్రజలు ఈ రెండు పార్టీలను తిరస్కరించారు. బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తున్న జనసేన ఈ ఎన్నికల్లో లోపాయికారీగా టీడీపీతోనే కలసి పనిచేసింది. ఆ మేరకు జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్‌తో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలో రెండు పార్టీలు అంతర్గతంగా కలసి పనిచేశాయి. అయితే రెండు పార్టీలకూ చుక్కెదురైంది. జిల్లాలోని 302 వార్డుల్లోనూ పోటీ చేసిన టీడీపీ కేవలం 23 వార్డులకు పరిమితమైంది. కర్నూలులో 8, నంద్యాల 4, ఎమ్మిగనూరు 3, ఆదోని 1, ఆళ్లగడ్డ 2, గూడూరు 3, ఆత్మకూరు 1, నందికొట్కూరు 1 చొప్పున మాత్రమే ఆ పార్టీ వార్డులను గెలుచుకుంది. మరోవైపు కర్నూలు, ఎమ్మిగనూరులో 8 సీట్లలో పోటీ చేసిన జనసేన అన్నింటా ఓడిపోయింది.  

>
మరిన్ని వార్తలు