బాబు నిస్సహాయత, నిట్టూర్పు

9 Mar, 2021 08:56 IST|Sakshi

గుంటూరు, విజయవాడలో నిశ్చేష్టులైన నేతలు

కార్పొరేషన్లలో చేతలుడిగిన టీడీపీ శ్రేణులు

అయోమయంలో అభ్యర్థులు

పరువైనా కాపాడుకుంటే చాలనుకుంటున్న సీనియర్లు

చివర్లో బరితెగింపునకూ పన్నాగాలు

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అధినేత ప్రచారంతో క్యాడర్‌లో మంచి ఊపు ఉత్సాహం వస్తుందని, పోలింగ్‌ రోజున మరిన్ని ఓట్లు రాబట్టుకోగలమని ఆశించిన విజయవాడ, గుంటూరులోని టీడీపీ నేతలు చంద్రబాబు నిస్సహాయత, నిట్టూర్పు, హావభావాలు, పరుష పదజాలంతో నిశ్చేష్టులయ్యారు. బుధవారం మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనున్నందున చివరి రెండు రోజులను విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో ప్రచారానికి చంద్ర బాబు  కేటాయించారు. రూట్‌ మ్యాప్‌ మొదలు, సమయపాలన, నేతల మధ్య కనీస సమన్వయం... ఏ కోణంలో చూసినా ఏ విధంగానూ స్పష్టతలేమి కొట్టొచ్చినట్లు కనిపించిందని, అధినేత అసహనం అడుగడుగునా వ్యక్తం కావడంతో సీనియర్‌ నేతలు, కార్యకర్తలను నివ్వెరపరచిందని పరిశీల కులు అభిప్రాయపడుతున్నారు.

అమరావతి కేంద్రంగా గత ప్రభుత్వ పాలన సాగినందున రెండు నగరాలకు చెందిన ఓ మోస్తరు నాయకులు బాబును దగ్గర నుంచి గమనించిన వారే ఈమేరకు చెబుతున్నారన్నారు. రాజధానికి కేంద్ర బిందువులని నిత్యం వల్లెవేసుకునే  రెండు నగరాలలో ఆయన ఎన్నికల పర్యటనను నిశితంగా పరిశీలించిన స్వపక్షీయులు జాతీయ అధ్యక్షుడి నాయకత్వ వైఫల్యాన్ని స్పష్టంగా అంచనావేసి   విశ్లేషిస్తున్నారు. విజయవాడ పర్యటనకు ముందురోజు నగర నాయకులు బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని)పై ధ్వజమెత్తిన తీరు పార్టీ దుస్థితిని ఎత్తిచూపింది. పారీ్టలో కొనసాగుతున్న ఏ స్థాయి నాయకులు కూడా స్వపక్షంలోని ప్రజాప్రతినిధిపై ఈ తీరున మాట్లాడిన దాఖలాలు గత కొన్నేళ్లలో లేవు.

గత సాధారణ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు నామమాత్రపు ప్రజాప్రతినిధులతో సరిపెట్టుకున్న పార్టీపై అధినేత పట్టు పూర్తిగా కోల్పోయారనేందుకు విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆ ముగ్గురు మాట్లాడిన తీరే నిదర్శనమని సీనియర్లు ఉదహరిస్తున్నారు. బొండా, బుద్దా, మీరాల హెచ్చరికల నేపథ్యంలో స్థానిక ఎంపీ కేశినేనిని ప్రచారంలో పూర్తిగా దూరంగా పెట్టారు. ఎక్కడా ఆయనను వాహనం దరిచేరనీయ లేదు. తన కుమార్తె శ్వేతను మేయర్‌గా చూడాలని ఆశించిన ఎంపీకి ఎన్నికల ప్రచార వాహనంలో కనీస స్థానం లేదంటే తమ పార్టీ దుస్థితి ఎక్కడికి చేరిందో, ఏ దిశలో ప్రయాణిస్తుందో అంచనాకు రావచ్చని సీనియర్లు విశ్లేíÙస్తున్నారు. మరోవైపు   సోమవారం గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎంపీ గల్లా జయ దేవ్‌ చంద్రబాబు వెంటే ఉన్నారు. విజయవాడలో తన పక్కన నిలుచోవడానికి కూడా స్థానిక ఎంపీ పనికి రాకపోగా గుంటూరు లో మాత్రం గల్లాను ఆసాంతం తన వెన్నంటే ఉంచుకోవడంలో చంద్రబాబు ఔచి త్యం ఏమిటని కేశినేని మద్దతుదారులు నిలదీస్తున్నారు. పార్టీ నాయకులపై బాబుకు కనీస పట్టు ఉందా అనే అనుమానం పార్టీ శ్రేణుల్లోనూ తలెత్తుతోంది. మొన్నటికి మొన్న కుప్పంలో ఆయన సమక్షంలోనే మీరు కాదు ఇతరులను తీసుకొచ్చి పగ్గాలు అప్పగించండని అన్నప్పుడే చంద్రబాబు భవిష్యత్, పార్టీ పరిస్థితి ఏంటో తేటతెల్లమైందని గుర్తుచేస్తున్నారు.  

అన్నింటా వైఫల్యాలే...  
గుంటూరు, విజయవాడలో చంద్రబాబు పర్యటనను పరిశీలిస్తే అన్నింటా వైఫల్యాలు కనిపించాయి. జనసమీకరణకు ఎంతైనా వెదజల్లండని అధిష్టానం ముందు నుంచే చెప్పినా, వెదజల్లినా స్పందన కరవైంది. రూట్‌ మ్యాప్‌ ఖరారులోనే తేడాలు కొట్టొచ్చినట్లు కనిపించింది. సమయపాలనలోనూ ఏమాత్రం పొంతన లేదు. దీనికంతటికీ కారణం మొదటి నుంచి అధినేత నిస్సహాయత, నిట్టూరు, అసహనం, అనిశ్చితే కారణమని చంద్రబాబును దగ్గర నుంచి దశాబ్దాలుగా చూస్తున్న పార్టీ సీనియర్ల విశ్లేషణ. ఎందుకో మా సహచరునిలో ఓర్పు, సహనం పూర్తిగా నశించిందని మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం బాబు స్థితికి అద్దం పడుతోంది.

ఆయన మాటలతో చేటే! 
చంద్రబాబు విజయవాడ, గుంటూరు లో మాట్లాడిన మాటలు స్వపక్షియులకే చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. అమరావతికి మద్దతు ఇవ్వకపోతే మీరు పాచి పనులకు పోతారు, అడుక్కుతింటారు, అసలు రోషం ఉందా? పౌరుషం లేదా? చీము, నెత్తురు లేదా? అంటూ నానా మాటలన్నారు. రెండు కార్పొరేషన్ల పరిధిలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు ఎక్కువ. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో అరవై వేల మందికి పైగా పేదలకు గృహాలను కేటాయించాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించగా చంద్రబాబు తన అనుయాయుల ద్వారా న్యాయస్థానాల్లో అడ్డుకున్నారు. అమరావతిలో పేదలకు నివాసాలు ఏర్పరిస్తే అక్కడ సామాజిక అసమానత ఏర్పడుతుందని నిస్సిగ్గుగా వ్యాజ్యంలో పొందుపరిచారు. అలాంటప్పుడు రాజధాని కోసం మీరు పోరాడాలి, మద్దతు ఇవ్వాలి, కార్పొరేషన్లలో టీడీపీని గెలిపించాలని పేదలకు ఎలా పిలుపునిస్తారని ప్రతిపక్ష పార్టీ నేతలే ప్రశి్నస్తున్నారు. పేదలకు ఆవాసాలే అక్కడ వద్దన్న నోటితో మీరు పాచిపనులు చేసుకుంటారా, రోషం, పౌరుషం లేదా అని ఎలా రెచ్చగొడతారని స్వపక్షీయులే విస్తుపోతున్నారు. అత్యంత రాజకీయ అనుభవజ్ఞడిగా తనకు తాను చెప్పుకునే తమ నేత స్థితిమితం లేని, అవగాహన రాహిత్యంతో ఉపన్యసించడం తమకే ఆశ్చర్యం కలిగించిందని వాపోతుండటం పరిశీలనాంశం.  

కనిపించని సీనియర్లు... 
విజయవాడ, గుంటూరుల్లో సీనియర్లకు పార్టీలో కొరత లేదు. రెండు కార్పొరేషన్లలో గెలుపు తప్పనిసరని, ప్రతిష్ఠతో కూడుకున్నదని చంద్రబాబు తొలినుంచీ చెపుతున్నా మాజీ మంత్రులు,  ప్రజాప్రతినిధులు, సీనియర్లకు చెవికెక్కలేదు. పార్టీలో తిరుగులేని నాయకులమని చెప్పుకునే మాజీ మంత్రి దేవినేని ఉమా, సీనియర్‌ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుల నియోజకవర్గాల్లోనే పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడంతో ఇతరులెవరూ ముందుకు రావడానికి సుముఖత కనపరచిన దాఖలాలు లేవు. మొన్నటి గుంటూరు, విజయవాడ నగరాల శివారు పంచాయతీల్లో ఫ్యాను గాలి జోరున వీచింది. దీంతో రెండు కార్పొరేషన్లలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ముందుగానే టీడీపీ నేతలు అంచనాకు వచ్చారు. ఆ దృష్ట్యా సీనియర్లు కలగజేసుకోలేదని బాహాటంగానే ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
చదవండి:
పరుష పదజాలం.. ప్రజలపై ప్రతాపం    
ఫ్రస్ట్రేషన్ ‌లో చంద్రబాబు 

మరిన్ని వార్తలు