గుంటూరు 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రోషన్
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): సామాజిక మాధ్యమాల్లో తనపై దుష్ప్రచారం చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు 29వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రోషన్ కోరారు. ఈ మేరకు గుంటూరులో అర్బన్ ఏఎస్పీ డి.గంగాధర్కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ నెల 18న వ్యక్తిగత పనుల నిమిత్తం కుటుంబసభ్యులతో మచిలీపట్నం వెళ్లి తిరిగి 20న గుంటూరు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు.
19న టీడీపీ కార్యాలయంపై దాడి చేశానంటూ తన ఫొటోను మార్ఫింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయించేందుకు టీడీపీ వెబ్సైట్లో, టీమ్ నారా లోకేష్ వాట్సాప్ గ్రూప్లో, సామాజిక మాధ్యమాలు, టీవీ చానెళ్లలో తన పేరును ప్రసారం చేయించి పరువుప్రతిష్ట దెబ్బతీశారని ఆయన తెలిపారు. తన ఫొటోలను తస్కరించి, ముఖాలు మార్ఫింగ్ చేసినవారిని సైబర్ క్రైమ్ కింద శిక్షించాలని కోరారు.