ఓడినా నాదే పైచేయి!

14 Feb, 2021 08:36 IST|Sakshi

తీరు మార్చుకోని చంద్రబాబు బృందం

టీడీపీ ప్రభంజనమంటూ మభ్యపుచ్చి సంబరాలు

సాక్షి, అమరావతి: రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీకి చెంపపెట్టు లాంటి తీర్పు చెప్పినా ఆ పార్టీ అధిష్టానం, నాయకులు మభ్యపుచ్చుకుంటూ విజయం సాధించినట్లు ప్రచారం చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తొలిదశ ఎన్నికల్లోనూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన పరివారం ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా వెలువడ్డ పంచాయతీ ఫలితాల్లో దాదాపు అన్నిచోట్లా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయభేరీ మోగించినా టీడీపీ నేతలు మాత్రం మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. అత్యధిక పంచాయతీలను గెలుచుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫలితాలు పూర్తిగా వెలువడే వరకు ఎదురు చూడాలని సంయమనం పాటిస్తుండగా టీడీపీ నాయకులు మాత్రం ఓడిపోయి కూడా జబ్బలు చరుచుకుంటూ మభ్యపుచ్చుకోవడం పట్ల ఆ పార్టీ సీనియర్‌ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటగా టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ మాత్రం తాము ప్రభంజనం సృష్టించినట్లు ప్రచారానికి తెర తీసింది. ఫలితాల టేబుల్‌ అంటూ రాత్రి 9 గంటల తర్వాత టీడీపీ కార్యాలయం ఒక జాబితాను మీడియాకు లీక్‌ చేసింది. అందులో టీడీపీ 343 పంచాయతీలను గెలుచుకుందని, వైఎస్సార్‌సీపీ 546 పంచాయతీల్లో నెగ్గిందని పేర్కొంది. ఇలా రకరకాల ప్రచారాల ద్వారా గందరగోళానికి గురి చేసే ఎత్తుగడను చంద్రబాబు బృందం అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
(చదవండి: ఎన్టీఆర్‌ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి)
టీడీపీ కంచుకోటలు బద్దలు
 

మరిన్ని వార్తలు