గెస్ట్‌ పాలిట్రిక్స్‌ వద్దు.. ముందు ఏపీకి రండి.. బాబుకు కార్యకర్తల హితబోధ!

16 Feb, 2023 13:53 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సొంత తమ్ముళ్ల నుంచి షాక్‌ ఎదురయింది. ఇన్నాళ్లు హైదరాబాద్‌ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో గెస్ట్‌ పాలిట్రిక్స్‌ చేస్తోన్న చంద్రబాబుకు ఇది సరైన తీరు కాదని తెలుగు తమ్ముళ్లే హితవు పలికారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నప్పుడు కార్యకర్తలు ఈ సూచనలు చేశారు. ముందు కుటుంబంతో సహా ఆంధ్రప్రదేశ్ కు రావాలని, ఇక్కడే నివాసం ఉంటేనే ప్రజలు నమ్ముతారని హితవు పలికారు. పక్క రాష్ట్రంలో ఉంటూ గెస్ట్ లా పర్యటనలు చేస్తే ప్రజలు కాదు కదా.. కార్యకర్తలు కూడా నమ్మరన్నది తమ్ముళ్ల మాట. అందుకే ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడో ఓ చోట ఇల్లు కట్టుకుని, కుటుంబంతో సహా స్థిర నివాసం ఉండాలని చంద్రబాబుకు ముఖం మీదే సూచించారు.

ముఖ్యమంత్రిగా అయిదేళ్లు ఉన్నా.. చంద్రబాబు ఆంధ్రపదేశ్‌లో ఇల్లు కట్టుకోలేదని, కరకట్టపై లింగమనేని ఇంట్లో ఉండి, పదవి పూర్తికాగానే మళ్లీ హైదరాబాద్‌ వెళ్లిపోయారన్నది కార్యకర్తల ఆవేదన. అంతకు ముందు కూడా హైదరాబాద్‌ నుంచే అప్‌ అండ్‌ డౌన్‌ చేసినా.. ఓటుకు కోట్లు కేసు బయటకు రాగానే.. అరెస్ట్‌ చేస్తారన్న భయంతో కరకట్టపైకి వెళ్లిపోయారన్నది అందరికీ తెలిసిన సత్యం.

ఇప్పటికీ చంద్రబాబుకు గెలుపుపై ఏ మాత్రం నమ్మకం లేదని, పార్టీ పాతాళంలోకి చేరుకోవడం వల్ల హైదరాబాదే బెటరని భావిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారు. అందుకే జగ్గంపేటలో కార్యకర్తలు చంద్రబాబుకు నేరుగా చురకలంటించారని పార్టీలో భావిస్తున్నారు.
చదవండి: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా

మరిన్ని వార్తలు