టీడీపీలో లుకలుకలు

28 Feb, 2021 12:41 IST|Sakshi

 34వ డివిజన్‌లో  ‘కొట్టేటి’కి సీటు నిరాకరణ

అధిష్టానానిదే తుది నిర్ణయమన్న కేశినేని

కార్యకర్తలతో ‘కొట్టేటి’ ర్యాలీ

హద్దు మీరితే తోకలు కట్‌ చేస్తానంటూ

ఎంపీ కేశినేని నాని వార్నింగ్‌

జగన్‌ మోహన్‌ రెడ్డి వందశాతం ఉత్తమం: కొట్టేటి శిరీష 

పూర్ణానందంపేట (విజయవాడ పశ్చిమ): టీడీపీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. 34వ డివిజన్‌లో పార్టీ సీనియర్‌ నాయకుడు కొట్టేటి హనుమంతరావు భార్య కొట్టేటి రమణికి మొదట బి–ఫాం ఇచ్చి తరువాత కాదనటంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో శనివారం కేదారేశ్వరపేట నుంచి ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్‌ వద్ద ఉన్న ఎంపీ కేశినేని నానీ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

అధిష్టానానిదే తుది నిర్ణయం  
అదిష్టానానిదే తుది నిర్ణయమని, ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించాల్సిందేనని ఎంపీ కేశినేని నాని కొట్టేటి హనుమంతరావును హెచ్చరించారు. ఇప్పటికే పార్టీ ఐదుసార్లు కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిందని, ఇప్పుడింకా ముసలి, ముతకలకు అవకాశం లేదని ఘాటుగా హనుమంతరావును హెచ్చరించారు. హద్దు మీరి ప్రవర్తిస్తే తోకలు కత్తిరిస్తానని, గుండారపు హరిబాబుకు పట్టిన గతే నీకూ పడుతుందని మండిపడ్డారు. 

జనంతో వస్తే భయపడేది లేదు! 
జనంతో వస్తే భయపడేది లేదని ఎంపీ కేశినేని హనుమంతరావును హెచ్చరించారు. ఎంతకాలం మీరే నాయకులుగా ఉండాలా.. కొత్త వారికి అవకాశం ఇవ్వరా అంటూ మండిపడ్డారు.

జగన్‌ మోహన్‌ రెడ్డి ఉత్తమం  
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వంద శాతం ఉత్తమమైన వ్యక్తని, నమ్ముకున్న వాళ్లకు సహాయం చేస్తారని, టీడీపీలో ఆ పద్ధతి లేదని కొట్టేటి హనుమంతరావు కుమార్తె కొట్టేటి శిరీష వాపోయారు. టీడీపీలో 40 ఏళ్లుగా ఉంటూ పని చేసిన తన తండ్రికి పార్టీ అన్యాయం చేసిందని, తాము ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచి వైఎస్సార్‌సీపీలో చేరి తీరుతామన్నారు. టీడీపీ తాగుబోతులకు, రౌడీషీటర్లకు టికెట్లు కట్టబెట్టి నమ్మకమైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. తాను ఇంజినీరింగ్‌ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నానని, పీహెచ్‌డీ చేస్తున్నానని, తనకూ అన్ని విషయాలపై అవగాహన ఉందని శిరీష ఘాటుగా స్పందించారు.
చదవండి:
బాబు వ్యూహం.. కేశినేనికి చెక్‌!
కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ..

మరిన్ని వార్తలు