30 ఏళ్లలో కుప్పానికి ఐదుసార్లు వచ్చా 

30 Jan, 2023 04:26 IST|Sakshi

మూడోరోజు పాదయాత్రలో లోకేశ్‌ 

శాంతిపురం (చిత్తూరు జిల్లా): తన తండ్రి ఎప్పటి నుంచో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా గత ముప్పై ఏళ్లలో ఐదుసార్లు మాత్రమే తాను కుప్పానికి వచ్చానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం శాంతిపురంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ఎవరైనా గట్టిగా మాటా­్లడినా, ఉద్యమించినా ప్రభుత్వం కేసులు పెడుతోందని, అన్నక్యాంటీన్‌ పెడితే వంద మందిపై కేసులు పెట్టారని ఆరోపించారు.

కేసులవల్ల తనతో సహా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై పోరాటానికి యువత కలిసిరావాలని పిలుపునిచ్చారు. మూడేళ్లలోనే కుప్పం అభివృద్ధి విషయంలో 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా అన్నీ చేస్తామన్నారు. అంతకుముందు.. స్థానిక ప్రైవేటు కళ్యాణ మంటపంలో టీడీపీ మహిళా నాయకురాళ్లతో సమావేశమైన లోకేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మద్యనిషేధం చేయలేదని చెప్పారు.

పన్నులు, నిత్యావసరాల ధరలు పెం­­చేశారని, జగన్‌రెడ్డి అప్పులు చేసి మహిళల తాళిబొట్లను కూడా తాకట్టు పెట్టారని విమ­ర్శిం­చారు. రాష్ట్రంలో సుమారు 900 మంది మహిళలపై దారుణాలు జరిగాయని.. దిశ చట్టం ఏం చేస్తోందని ప్రశ్నించారు. డ్వాక్రా గ్రూపులను ప్రవేశపెట్టింది చంద్రబాబేనన్నారు.  

లోకేశ్‌ పర్యటన ఇలా.. 
ఇక పాదయాత్రలో భాగంగా ఆదివారం ఉదయం శాంతిపురం మండలం టి.కొత్తూరు క్రాస్‌ వద్ద ఉన్న బస నుంచి శాంతిపురం, బడుగుమాకులపల్లి, మఠం, గుండిశెట్టిపల్లి, నాయనపల్లి, రాజుపేటరోడ్డు (ఇది కర్ణాటక) మీదుగా రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లి వద్ద ఏర్పాటుచేసిన బస వరకూ లోకేశ్‌ నడక సాగించారు. యువగళం మూడవ రోజు దాదాపు 10 కి.మీ. మేర పాదయాత్ర సాగింది. 

మరిన్ని వార్తలు