టీడీపీ కార్యకర్తల వీరంగం.. రామతీర్థంలో ఉద్రిక్తత

2 Jan, 2021 14:07 IST|Sakshi

సాక్షి, విజయనగరం: రామతీర్థంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక తమను అడ్డుకున్న పోలీసులపై సైతం టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. కాగా జిల్లాలోని రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28 అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి కొలనులో పడేసిన విషయం విదితమే. ఈ దుశ్చర్యపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది.(చదవండి: చిల్లర రాజకీయాల కోసమే రామతీర్థానికి చంద్రబాబు)

ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం రామతీర్థం ఆలయాన్ని సందర్శించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని,  కొండ పక్కన ఉన్న కొలను ప్రాంతాన్ని పరిశీలించారు. ఆలయ అర్చకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. కొండ కింద ప్రాంతంలో రామ నామస్మరణతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోందంటూ మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొండకిందకు వచ్చి కారులో వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. మరోవైపు... కొండపైకి చంద్రబాబు నాయుడు, చినరాజప్పలతోపాటు తమను కూడా అనుమతించాలని టీడీపీ నాయకులు ఘర్షణకు దిగారు. బీజేపీ నేతలు ఇదే తరహాలో వ్యవహరించాయి. దీంతో రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, బీజేపీ కార్యకర్తల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు