‘బహిష్కరణ’ బేఖాతర్‌..‌

9 Apr, 2021 08:02 IST|Sakshi

దాదాపు అన్నిచోట్లా పోటీలో అభ్యర్థులు

సాక్షి, అమరావతి/గుడుపల్లె(చిత్తూరు జిల్లా): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపును తీవ్రంగా వ్యతిరేకించి, తిరుగుబాటు చేసిన నేతలు, కార్యకర్తలు పార్టీ నిర్ణయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల కోసం విస్తృతంగా పనిచేశారు. చంద్రబాబు చెబుతున్నా వినకుండా ఎన్నికల ప్రచారం చేసిన నాయకులు పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఏజెంట్లను నియమించారు.

గ్రామాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి లబ్ధిపొందడానికి ప్రయత్నించారు. అనేకచోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆ పార్టీ నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో ఘర్షణలకు దిగారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మినహా మిగిలిన అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులు దాదాపుగా పోటీలో ఉన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు వారి కోసం ప్రచారం చేయడంతోపాటు వ్యూహాలు కూడా రూపొందించి ఎన్నికల ప్రక్రియలో భాగమయ్యారు.

ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఏకంగా పోలీసు అధికారులతో గొడవకు దిగారు.  
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పార్టీ నేతలకు సూచనలిస్తూ హడావుడి చేశారు.  
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కనుసన్నల్లో టీడీపీ నాయకులు పనిచేశారు.  
గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపువారిపాలెంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు.  
కర్నూలు జిల్లా బేతంపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద ఆ పార్టీ నేతలు హల్‌చల్‌ చేశారు.  
ఇలా ప్రతిచోటా టీడీపీ నాయకులు, కార్యకర్తలు హడావుడి చేసి అధినేతను పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా వ్యవహరించారు.

టీడీపీ చంద్రబాబు సొంతం కాదు..
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సొంతం కాదని కుప్పంలో టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.  కుప్పంలో టీడీపీ నేతలు పరిషత్‌ పోలింగ్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం కొడతనపల్లె ఎంపీటీసీ సెగ్మెంట్‌కు సంబంధించిన కొడతనపల్లె, చిన్నగొల్లపల్లె గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నాయకులు ఏజెంట్లను పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొన్నారు.  వారు మాట్లాడుతూ.. ‘టీడీపీ అగ్రనాయకులకు మాత్రం పదవులు కావాలా? కార్యకర్తలకు పదవులు వద్దా? ఆయన ఎన్నికల్లో పోటీ చెయ్యొద్దంటే మేం పోటీ చేయకూడదా.. అదంతా కుదరదు మేం పోటీచేసి తీరుతాం’.. అని చంద్రబాబుపై మండిపడ్డారు.
చదవండి:
మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్‌ చెక్‌’   
‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ..

మరిన్ని వార్తలు