ప్రజాప్రయోజన బడ్జెట్ ప్రవేశపెట్టకుండా అడుగడుగునా అడ్డంకులు
స్పీకర్పై కాగితపు ముక్కలు విసురుతూ టీడీపీ సభ్యుల గందరగోళం
స్పీకర్, సీఎం, ఇతర సభ్యులు వారించినా మారని టీడీపీ సభ్యుల తీరు
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 14 మంది ఒకరోజు సస్పెన్షన్
సాక్షి, అమరావతి: టీడీపీ సభ్యులు గురువారం శాసనసభలో దుష్టçపన్నాగానికి తెరతీశారు. ఆర్థికమంత్రి బుగ్గన గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఉపక్రమించగానే సభలోకి వచ్చిన టీడీపీ సభ్యులు నినాదాలు అరుపులతో బడ్జెట్ ప్రసంగం వినపడనీయకుండా గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు పెద్దగా నినాదాలు చేస్తుంటే, మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు చిత్తు కాగితాల ముక్కలను స్పీకర్పైకి, గాలిలోకి విసిరారు.
బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా అడ్డుపడటం మంచిది కాదని, ఏమైనా అభ్యంతరాలుంటే బడ్జెట్ చర్చలో తెలపవచ్చని మంత్రులు, స్పీకర్ చెప్పినా వారు వెనక్కు తగ్గకపోగా మరింత రెచ్చిపోయారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని టీడీపీ తీరును తప్పుబట్టారు. వార్షిక బడ్జెట్ను ప్రజలంతా ఆసక్తిగా చూస్తారని, అలాంటి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ను కోరారు.
బడ్జెట్ ప్రసంగం ప్రజలకు వినపడకూడదనే కుతంత్రంతోనే వారు గందరగోళం సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. సభ సజావుగా జరిగేలా, ప్రజలకు బడ్జెట్ ప్రసంగం వివరంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ..ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడం సరికాదని, ఇష్టం లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోవాల్సిందిగా కోరారు.
టీడీపీ సభ్యుల తీరులో మార్పు లేనందున తప్పని పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకుంటున్నానంటూ టీడీపీకి చెందిన 14 మంది సభ్యులను ఒకరోజు పాటు సమావేశాల నుంచి సస్పెండ్ చేశాకే, బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సస్పెండ్ అయిన తర్వాత కూడా సభ్యులు వెళ్లకుండా గొడవ చేస్తుండటంతో మార్షల్స్ వారిని బయటకు పంపించారు.