తీన్మార్‌ మల్లన్నపై బీజేపీ సీరియస్‌! హిమాన్షును అలా అనలేదని వివరణ?

26 Dec, 2021 11:41 IST|Sakshi
తీన్మార్‌ మల్లన్న

సాక్షి, హైదరాబాద్‌: కేటీఆర్‌ తనయుడు హిమాన్షును ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తీన్మార్‌ మల్లన్నను బీజేపీ ముఖ్య నేతలు కోరినట్టు తెలిసింది. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని, అది పార్టీ సిద్ధాంతం కాదని సూచించినట్టు సమాచారం. అయితే తాను ‘బాడీ షేమింగ్‌’కు పాల్పడలేదని.. భద్రాద్రి రాముడికి సీఎం కేసీఆర్‌కు బదులు మనవడు హిమాన్షు తలంబ్రాలు సమర్పించడం, ఆ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొనడాన్ని తాను గుర్తుచేశానని మల్లన్న వివరణ ఇచ్చినట్టు తెలిసింది.

అప్పటి పరిస్థితిని, ప్రస్తుత పరిస్థితిని పోల్చిచెబుతూ.. హిమాన్షు ఇంత పెద్దవాడైనా, నాటి సమస్యలు మాత్రం తీరలేదనే తాను పేర్కొన్నానని వివరించినట్టు సమాచారం. కానీ టీఆర్‌ఎస్‌ నాయకులు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అన్ని అంశాలను పరిశీలించి తన తప్పేదైనా ఉందో చూడాలని కోరినట్టు తెలిసింది. అయితే ఏదేమైనా వ్యక్తిగత దూషణలు, కించపర్చే వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే మంచిదని పార్టీ నేతలు మల్లన్నకు స్పష్టం చేసినట్టు సమాచారం.
చదవండి: తీన్మార్‌ మల్లన్నపై బీజేపీ అధిష్టానం సీరియస్‌!
చదవండి: ఇంతమంది చనిపోతుంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏం చేస్తోంది?

మరిన్ని వార్తలు