రాజకీయ వారసుడ్ని ప్రకటించిన నితీశ్ కుమార్.. సీఎంగా ఇదే చివరిసారి!

13 Dec, 2022 18:40 IST|Sakshi

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ వారసుడు ఎవరో సూత్రప్రాయంగా తెలిపారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని ముందుండి నడిపిస్తారని స్పష్టం చేశారు. అధికార ఎమ్మెల్యేలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యానించారు. 

నేను ప్రధాని అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థినీ కాదు. బీజేపీని ఓడించడమే నా లక్ష‍్యం. అని నితీశ్ అన్నారు. తేజస్వీ యాదవ్‌ను ప్రోత్సహించాలని అధికార కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు.

సోమవారం కూడా నితీశ్ ఈ విషయంపై పలుమార్లు హింట్ ఇచ్చారు. తేజస్వీ యాదవ్‌తో కలిసి నలందలో డెంటల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం చాలా చేస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే వాటిని తేజస్వీ యాదవ్ పూర్తి చేస్తారు. మమ్మల్ని విడదీయాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాలు మానుకోండి. మేం కలిసే ఉంటాం. ఎలాంటి విభేదాలు ఉండవు. అని వ్యాఖ్యానించారు.

దీంతో తేజస్వీ యాదవ్‌ను నితీశ్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారని ప్రచారం ఊపందుకుంది. ఆ మరునాడే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో నితీశ్ మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది

నితీశ్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే అని, ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు.
చదవండి: ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు బెదిరింపులు.. మళ్లీ అతడే..!

మరిన్ని వార్తలు