Telangana Assembly Session 2021: రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు

5 Oct, 2021 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళిత బంధు హుజూరాబాద్‌ కోసం పెట్టలేదు. కరోనా కన్నా ముందే దళిత బంధు ఆలోచన చేశాం. కానీ కోవిడ్‌ వల్ల ఆలస్యమయ్యింది. దీనిపై విపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబబ్లీలో అసహనం వ్యక్తం చేశారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ దళిత బంధు సహా పలు అంశాలపై మాట్లాడారు. 

దళితబంధు గురించి...
‘‘ఈ దేశంలో నేటికి కూడా వెనకబడిన సామాజిక వర్గం దళితులే. వారు దయనీయ స్థితిలో ఉన్నారు. సామాజిక వివక్ష కారణంగానే దళితులు పేదరికంలో ఉన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళితులందరి పరిస్థితి ఇలానే ఉంది. వారిని అభివృద్ధి చేయడం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు’’ అని కేసీఆర్‌ తెలిపారు.
(చదవండి: కేంద్రంతో గలాటానే.. అందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం కేసీఆర్‌)

‘‘దళిత బంధు పథకంపై చర్చకు అన్ని పార్టీలను ఆహ్వానించాం. మా పాటికి మేము చేయలేదు. ప్రగతి భవన్‌లో దళిత బంధు పథకం అమలుపై పదిన్నర గంటలు చర్చించాం. 119 నియోజకవర్గాల్లో అమలు చెయ్యాలనే ఆలోచన ఉండే. 100 నియోజకవర్గాలకు ఈ మార్చ్ లోపు 100మందికి అమలు చేస్తాం. హుజురాబాద్‌తో పాటు మిగిలిన నాలుగు మండలాల్లో పూర్తిగా మార్చ్ వరకు అమలు చేస్తాం. దళిత బంధు కోసం వచ్చే బడ్జెట్ లో 20వేల కోట్ల రూపాయలు పెడుతాం. ’’ అని తెలిపారు.

‘‘దళిత బంధు కింద 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. అందులో 1,400 కోట్ల రూపాయలు మాత్రమే దళితులకు వెళ్తున్నాయి. దళిత ఎంపవర్‌మెంట్‌ కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించాం. ఈ నేపథ్యంలో వారి అభివృద్ధి కోసం దళితబంధు తీసుకొచ్చాం. ఈ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాయి’’ అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
చదవండి: మంత్రి మల్లారెడ్డి తీరుపై ఆగ్రహం.. సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు

‘‘హుజురాబాద్ ఎన్నికల తరువాత టీఆరెస్ ప్రభుత్వం మారుతుందా. టీఆర్‌ఎస్‌కు హుజురాబాద్ ఒక్కటే ఎన్నిక ఉందా.. ఇంకా ఎన్నికలు రావా. భవిష్యత్తులో మా ప్రభుత్వమే వస్తది. కొంతమంది ఈస్మార్ట్ కలలు కంటున్నారు. కానీ అవి నెరవేరవు’’ అన్నారు కేసీఆర్‌.

కుల గణన చేయడానికి కేంద్రం ఎందుకు నిరాకరిస్తోంది
దళితుల శాతం దేశంలో పెరిగింది. దళితుల రిజర్వేషన్ల శాతం పెంచాలి. కేంద్రం దాన్ని గుర్తించాలి. కేంద్రం బీసీ కులగణన చెయ్యడానికి ఎందుకు నిరాకరిస్తోంది. బీసీల కులగణన చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పంపుతాం. ఎస్సీ రిజర్వేషన్లపై శాసనసభలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పక్కన పెట్టింది. రఘునందన్ రావు కేంద్రం నుంచి రిజర్వేషన్లు అమలు చేసుకోని తెస్తే ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలుకుతాం’’ అని కేసీఆర్‌ తెలిపారు. 

రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు
కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ఇప్పటి వరకు 1, 51,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాము. 1,31,000 ఉద్యోగాలు ఇచ్చాము. త్వరలోనే ఉద్యోగాలు పొందిన వారి లిస్ట్ అసెంబ్లీకి ఇస్తాం. రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతాయి. నాకున్న అంచనా మేరకు 70వేల వరకు ఉద్యోగాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు దళితబంధు వర్తింపచేస్తాం’’ అన్నారు కేసీఆర్.

చదవండి: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ

మరిన్ని వార్తలు