పదవి లేకుంటే పార్టీని తిట్టడమేనా..?

8 Dec, 2021 02:13 IST|Sakshi

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పదవీ కాలం పూర్తవగానే టీఆర్‌ఎస్‌ను తిట్టడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా ఉద్యోగ సంఘం మాజీ నేత విఠల్‌కు సీఎం కేసీఆర్‌ ఆరేళ్లు అవకాశమిచ్చి గౌరవించారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ద్వారా పదవులు పొంది వాటిని కోల్పోగానే పార్టీపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి బాల్కసుమన్‌ మంగళవారం టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తోన్న నిరసనను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీలో విందులతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్‌ భార్య జమున పేరిట ఉన్న హేచరీస్‌ ప్రభుత్వ భూములతో పాటు ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేశారని మెదక్‌ కలెక్టర్‌ ఆధారాలతో సహా బయట పెట్టినందున ఈటల ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు