వానాకాలం పంట కొంటారా? కొనరా? చెప్పండి: బండి సంజయ్‌ 

13 Nov, 2021 03:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలంలో రైతులు పండించిన పంట కొనుగోలు చేస్తారా? లేదా? అన్న దానిపై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలోనే కేసీఆర్‌ దీక్ష చేయలేదని, ఇప్పుడేం ధర్నాలు చేస్తా రని ఎద్దేవా చేశారు. ఒకవేళ కేసీఆర్‌ ధర్నాలు చేసినా టైం పాస్‌కే చేస్తారంటూ వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం సంజయ్‌ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడినపుడు సంజయ్‌ పలు అంశాలపై మాట్లాడారు.

కేసీఆర్‌కు కూడా ఈడీ భయం పట్టుకుందని, సానుభూతి కోసమే ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్, టీఆర్‌ఎస్‌ లేవనెత్తిన అంశాలన్నింటికీ తాము సమాధానాలు చెప్పామని, అయినా కేసీఆర్‌ ఎందుకు మాట్లడడం లేదని ప్రశ్నించారు. తాము పంటల మార్పిడికి వ్యతిరేకం కాదని, ముందస్తుగా దీనిపై రైతులకు అవగాహన కల్పించి పంట మార్పిడికి సంసిద్ధం చేయాలని సంజయ్‌ సూచించారు. ఓ వైపు రైతులు కల్లాలు, రోడ్లు, మార్కెట్ల వద్ద ధాన్యం పెట్టుకొని అమ్ముకోలేక వర్షాలు పడతాయే మోనని ఆందోళనలో ఉంటే.. అధికారంలో ఉండి టీఆర్‌ఎస్‌ వాళ్లు సిగ్గులేకుండా ధర్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ధర్నాకు వచ్చిన వారే కేసీఆర్‌ డౌన్‌డౌన్‌ అంటున్నారని వాళ్లకు వాస్తవ విషయాలు తెలిసినట్లు లేదన్నారు.  

మరిన్ని వార్తలు