కేసీఆర్‌ కుటుంబంతో ఆ ముగ్గురికి సంబంధాలు.. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

27 Oct, 2022 12:51 IST|Sakshi

సాక్షి, నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పాలనపై బీజేపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని మండిపడ్డారు.
చదవండి: ఫాంహౌస్‌ డీల్‌పై వెలుగులోకి షాకింగ్‌ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది?

‘‘పోటీ చేసే అభ్యర్థి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అనేది మాట్లాడాలి. తెలంగాణలో మూర్ఖత్వంగా సాగిస్తున్న కేసీఆర్ పాలన అంతం చేసేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడును అభివృద్ధి చేయలేదు. కనీస అవసరాలు తీర్చలేదు. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి బయటకు గెంటారు. మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు’’ అని బండి సంజయ్‌ అన్నారు.

‘‘సీఎం కేసీఆర్‌ ఏం చేస్తున్నారు. కేవలం బీజేపీ, మోదీని తిట్టడమే పని పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని పక్క‌న ఉంచుకుని తిప్పుకోవడమే నేతలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకుపోతున్నాం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక‌ ఇది. మునుగోడు ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే ఈ చార్జ్‌షీట్‌ విడుదల చేశాం’’ అని బండి సంజయ్‌ అన్నారు.

ఫాంహౌస్‌ ఎపిసోడ్‌ అంతా డ్రామా. కేసీఆర్‌ కుటుంబంతోనే ఆ ముగ్గురికి సంబంధాలు. ఆడియో టేపులు ఇంకా రెడీ కాలేదట. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇంత అవసరమా. ఢిల్లీలో కేసీఆర్‌ను ఎవరెవరు కలిశారో వివరాలు బయటపెట్టాలి. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తాం. సీబీఐ విచారణ కూడా జరగాల్సిందే’’  అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు