రైతుబంధు నిధులు వెంటనే జమచేయాలి 

10 Jun, 2022 03:03 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ బహిరంగలేఖ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులు రూ.7,500 కోట్లు వెంటనే రైతులఖాతాల్లో జమచేయాలని, 2018 ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీని అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతాంగం, రైతు సంఘాల నాయకులు నేరుగా, ఫోన్ల ద్వారా అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని సీఎంకు రాసిన బహిరంగలేఖలో పేర్కొన్నారు.

‘ఫామ్‌హౌస్‌ సీఎం అయిన మీకు రైతుల కష్టాలు, కడగండ్లు పట్టవు. 8 ఏళ్ల మీ పాలన ‘రైతుల కంటకన్నీరు.. మీ ఫామ్‌హౌస్‌ పంట పన్నీరుగా తయారైంది’ అని మండిపడ్డారు. రైతుబంధు నిధులు విడుదల కాకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి ప్రధాన సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ఎన్నికల హామీ రూ.లక్ష రుణమాఫీ అమలు కాకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు పెరిగి రైతుల ఆర్థిక పరిస్థితి చితికిపోయిందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను గాలికొదిలి దేశవ్యాప్తంగా మీ వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.  

>
మరిన్ని వార్తలు