1న జీతాలివ్వకపోవడం అసమర్థతే 

25 Jul, 2022 01:08 IST|Sakshi

సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు 1 వ తారీఖునే జీతాలివ్వలేకపోవడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనంగా నిలుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. వచ్చే నెల నుంచి అయినా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

2014లో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని నేడు అప్పులపాలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. ఉద్యోగులు, పింఛనుదారులు ప్రతీనెలా 15 తేదీవరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు సకాలంలో వేతనాలు చెల్లించæనిపక్షంలో వారి జీవించేహక్కును కాలరాయడమేనని స్పష్టం చేసిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు.  

మరిన్ని వార్తలు