గోవిందరావుపేట: 5వ బెటాలియన్ ఏర్పాటుకు పేదల భూములే దొరికా యా? సీఎం కేసీఆర్ ఫామ్హౌస్లో నిర్మించవచ్చు కదా అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. బహుజన రాజ్యాధి కార యాత్ర సోమ వారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సాగింది. ఈ సందర్భంగా బెటాలియన్ ఏర్పాటులో భూములు పోతున్న చల్వాయి రైతులతో ప్రవీణ్ మాట్లాడారు.
పేదలకు చెందిన 105 ఎకరాల భూమిని 5వ బెటాలియన్ కోసం కేటాయించారని, నిర్వాసితులకు ఉద్యోగం, నివాస స్థలం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. పేదల తరపున మాట్లాడే వారేలేరని, వారికి నోరులేదని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా అడిగిన వారిని జైలుకు పంపుతున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తుందని హామీ ఇచ్చారు.