CM KCR Elections Strategy: కేంద్రం టార్గెట్‌గా సీఎం కేసీఆర్‌ కొత్త వ్యూహం!

16 Nov, 2022 15:31 IST|Sakshi

కేంద్రం టార్గెట్‌గా కేసీఆర్‌ ప్రణాళికలు రచిస్తున్నారా?. దర్యాప్తు సంస్థలతో ఢీ కొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారా?. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా?. మునుగోడు స్ట్రాటజీని వచ్చే ఎన్నికల్లో అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారా?. అసలు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏం జరిగింది? అనేది ఓ పరిశీలిస్తే..

కేంద్రాన్ని ఢీ కొనేందుకు సీఎం కేసీఆర్‌ సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలే టార్గెట్‌గా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తుంటే వాటిని తిప్పికొట్టేందుకు తనకున్న అధికారాలను ప్రధాన అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. బీజేపీ నేతలే టార్గెట్‌గా రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపుతున్నారు. ఇదే అంశాన్ని ఎల్పీ సమావేశంలో నేతలకు చెప్పినట్లు సమాచారం. 

కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని వారు ఎంత దూరం వెళ్తే మనం అంత దూరం వెళదామని నేతలకు కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రధాన టార్గెట్‌గా నేతలంతా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ సూచించారు. నియోజకవర్గాల్లో బీజేపీని దోషిగా నిలపాలని, ప్రతి అవకాశాన్ని వాడుకోవాలన్నారు. తన కూతురు కవితని పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని ఇంత దారుణమైన రాజకీయాలు ఉంటాయా? అని వాపోయారు. పార్టీలో ఇంకెవరికైనా పార్టీ మారాలని ఒత్తిడి తెస్తే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. రానున్న 10 నెలలు కీలకమని అందరూ సీరియస్‌గా పనిచేయాలని సూచించారు. లేదంటే చర్యలు తప్పవంటూ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. 

చదవండి: (ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ క్లారిటీ)

మునుగోడు ఉప ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన చోట ఇంఛార్జ్‌లుగా వ్యవహరించిన మంత్రులకు క్లాస్‌ పీకినట్లు సమాచారం. నిత్యం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ పనిచేయాలని సూచించారు. రానున్న కాలమంతా ఎన్నికల సంవత్సరంగా భావించి పనిచేయాలన్నారు. మునుగోడు అమలు చేసిన స్ట్రాటజీని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. ప్రతి 100 మందికి ఓ ఇన్‌ఛార్జ్‌ను నియమించి ప్రణాళికతో ముందుగా సాగాలని నేతలను ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలు, ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలను ఆదేశించారు. అంతర‍్గత కుమ్ములాటలతో పార్టీకి నష్టం చేకూరిస్తే అసలు స్థానమే కోల్పోతారని పలువురు నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. మొత్తానికి మూడోసారి అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు, బీజేపీని ధీటుగా ఎదుర్కొనేలా కేసీఆర్‌ కార్యాచరణ మొదలుపెట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఢీకొనేందుకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపాలని కేసీఆర్‌ డిసైడ్‌ అయిపోయారు.

మరిన్ని వార్తలు