కేసీఆర్‌కు పోయేకాలమొచ్చింది..

16 Nov, 2021 01:44 IST|Sakshi

అసహనంతోనే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు: ఈటల

ప్రలోభాలకు ఎలా పాల్పడవచ్చో నేర్పిన ట్రబుల్‌ షూటర్‌

హన్మకొండ: ఓడిపోయామన్న అసహనంతో సీఎం కేసీఆర్‌ భౌతికదాడులకు పాల్పడుతున్నారని, ఆయనకు పోయేకాలం వచ్చిందని బీజేపీ సీనియర్‌ నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హనుమకొండలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నల్లగొండ జిల్లాలో జరిగిన దాడిని ఈటల తీవ్రంగా ఖండించారు.

హరీశ్‌రావు ట్రబుల్‌ షూటర్‌ అని చెబుతున్నారని, ఈయన నాలుగు రకాల పనులు నేర్పారని, డబ్బులు ఎలా ప్యాక్‌ చేయొచ్చో.. ప్యాక్‌ చేసిన డబ్బులు, మద్యం ఎలా పంచొచ్చో.. ఎలా బెదిరించొచ్చో.. ఎలా ప్రమాణం చేయించవచ్చో నేర్పారని ఎద్దేవా చేశారు. ఐటీ చెల్లించేవారికి,  పెద్ద రైతులకు రైతుబంధు ఇవ్వాల్సిన అవసరమేమొ చ్చిందని, సాగు చేసిన భూమికి, నిజమైన రైతుకు మాత్రమే రైతుబంధు ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

పెట్టుబడి పెట్టి సాగుచేసే కౌలు రైతును విస్మరించడం న్యాయం కాదన్నారు. సీఎం కేసీఆర్‌ ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కేంద్రం బియ్యం కొనలేమని చెప్పడం లేదని, గతంలో దిగుమతి చేసుకున్న రాష్ట్రాల్లో వరి సాగు చేస్తున్నారని, దీంతో బాయిల్డ్‌ రైస్‌ తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని, రా రైస్‌ మాత్రమే ఇవ్వాలని చెప్పిందన్నారు.  తెలంగాణపై బీజేపీకి ఎలాంటి వివక్ష లేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రానికి మెడికల్‌ కాలేజీలు రావడంలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు