ఇది అప్పులకుప్ప ప్రభుత్వం: ఈటల

17 Oct, 2021 03:05 IST|Sakshi
మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌   

కమలాపూర్‌: కేసీఆర్‌ అహంకారాన్ని, డబ్బు సంచులని లిక్కర్‌ సీసాలని, పోలీస్‌ దుర్మార్గాలని ఈనెల 30న బొందపెట్టాలని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం గుండేడు, కొత్తపల్లి, కన్నూరు, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజుపల్లి, ఉప్పల్‌ గ్రామాల్లో శనివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డబ్బులిస్తే కాంట్రాక్లర్టు డబుల్‌ బెడ్రూంలు, బ్రిడ్జీలు కట్టరా.. రోడ్లు వేయరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని, ఇది అప్పుల కుప్ప ప్రభుత్వమని భయపడే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని విమర్శించారు.

ప్రజలను గోల్‌మాల్‌ చేయాలని చూస్తున్న మిమ్మల్ని ఈ నెల 30న ప్రజలే గోల్‌మాల్‌ చేస్తారని, 30వ తేదీన ఒక్క గుద్దు గుద్దితే దిమ్మ తిరిగి, ఇంకోసారి హుజూరాబాద్‌ జోలికి రారని వ్యాఖ్యానించారు. హరీశ్‌రావును ఉద్దేశించి మాట్లాడుతూ, కేసీఆర్‌ నిన్నూ నన్నూ అవమానించింది నిజం కాదా? కన్నీళ్లతో మన పరుపులు తడిసిపోతే నీ భార్యా నా భార్య చూసింది నిజం కాదా? ఇవాళ నీ పదవికోసం కేసీఆర్‌ కత్తి ఇస్తే నన్ను పొడవాలని చూస్తున్నావని ఈటల ఆరోపించారు. ‘ఆస్తులు పోగేసుకున్నది మీరు, పోగొట్టుకున్నది నేను. 18 ఏళ్లు ఉద్యమ బిడ్డగా, తెలంగాణ గర్వంచేలా బతికిన. హుజూరాబాద్‌లో మీ అబద్ధాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఆస్తులు, ఆరోపణలపై అంబేడ్కర్‌ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావులను ఈటల సవాల్‌ చేశారు. 

మరిన్ని వార్తలు