బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టాలి

6 Oct, 2021 01:44 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో చేరినవారితో మంత్రి హరీశ్‌రావు

ఈటల ఏడేళ్లుగా అభివృద్ధిని పట్టించుకోలేదు: హరీశ్‌రావు 

హుజూరాబాద్‌ అభివృద్ధి మా బాధ్యతే

హుజూరాబాద్‌: ప్రభుత్వరంగ సంస్థలను అడ్డగోలుగా అమ్మేస్తోన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ పాలనను గమనిస్తోన్న హుజూరాబాద్‌ ఓటర్లు ఈ ఉపఎన్నికలో కర్రుకాల్చి వాతపెట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన 150మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ క్రమంలో వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ధరలు పెంచి ప్రజలకు వాతలు పెడుతుంటే రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛను వంటి పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ అభివృద్ధి తమ బాధ్యతేనని, ఇక్కడి సమస్యలన్నింటినీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే పరిష్కరిస్తుందని హామీనిచ్చారు. ఏడేళ్లు మంత్రిగా ఉన్న ఈటల హుజూరాబాద్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. హుజూరాబాద్‌కు నాలుగు వేలఇళ్లు మంజూరు చేస్తే..ఈటల ఒక్కటికూడా కట్టించలేకపోయారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు