తెలంగాణ: షర్మిల పార్టీకి ఝలక్‌.. బీఆర్‌ఎస్‌లోకి ఏపూరి సోమన్న

22 Sep, 2023 17:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీకి ఝలక్‌ ఇస్తూ.. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న బీఆర్‌ఎస్‌లో చేరున్నారు. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖరారు అయ్యింది. ఈ మేరకు చేరికకు ముందర ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావును మర్యాదపూర్వకంగా కలిశారాయన. సోమన్నను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేటీఆర్‌.. సదరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. 
 
రెండేళ్ల కిందట ఆయన వైఎస్సార్‌టీపీలో చేరారు. అప్పటి నుంచి  ఆయన షర్మిల వెంట నడుస్తూ వస్తున్నారు. ఏపూరి సోమన్న నిన్నటి దాకా వైఎస్సార్‌టీపీ తరపున తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎమ్మెల్యే  అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు.  ఈ క్రమంలో వైఎస్సార్‌టీపీకి ఝలక్‌ ఇస్తూ..  టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ సమక్షంలో ఇవాళ కేటీఆర్‌ను కలిశారు. 

సోమన్న అంతకు ముందు ఆయన కాంగ్రెస్‌లోనూ పని చేశారు. ఆ టైంలో రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నడుచుకున్నారు. రేవంత్‌ పాదయాత్రలోనూ పాల్గొని సోమన్న తన గళం వినిపించారు. కాంగ్రెస్‌ను వీడి.. వైఎస్సార్‌ టీపీలో చేరే సమయంలో ‘‘నియంతృత్వ భావజాలం ఉన్న ప్రభుత్వాన్ని(బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి..) ఎదుర్కొనేందుకే వైఎస్సార్‌ టీపీలో చేరుతున్నాన’’ని ప్రకటించారాయన. ఇక సోమన్న పాటలకు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు