కాళేశ్వరం కోసం అన్నింటినీ పక్కనపెట్టారు 

4 Sep, 2020 02:48 IST|Sakshi

అఖిలపక్ష భేటీలో వక్తలు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్రంలో నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పక్కనపెట్టారని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం భారీగా పెరగడంతో మిగతా ప్రాజెక్టులన్నీ వెనకబడ్డాయన్నారు. ఇప్పటికైనా కృష్ణాబేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. గురువారం టీ–జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని ఓ హోటల్‌లో ‘కృష్ణా నది–తెలంగాణ పెండింగ్‌ ప్రాజెక్టులు’అనే అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, వామపక్ష పార్టీల నేతలు అజీజ్‌పాషా, గోవర్ధన్, కాంగ్రెస్‌ నేతలు వంశీచంద్‌రెడ్డి, ఇందిరా శోభన్, కత్తి వెంకటస్వామి, రిటైర్డ్‌ ఇంజనీర్లు దొంతు లక్ష్మీనారాయణ, శ్యాం ప్రసాద్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రేవంత్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్‌–నారాయణపేట పథకాన్ని పూర్తిగా పక్కన పడేసిందని దుయ్యబట్టారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ఐక్య ఉద్యమాల నిర్మాణం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఏపీ నిర్మిస్తున్న సం గమేశ్వర ప్రా జెక్టు పూర్తయితే పాలమూరు ఎడారిగా మారుతుందన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్‌æ ఇంజనీర్లు  లక్ష్మీనారాయణ, శ్యాం ప్రసాద్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు రిటైర్డ్‌ ఇం జనీర్లు సీఎం కేసీఆర్‌తో అంటకాగుతున్నారని, ఒక్క డిండి ప్రాజెక్టు కోసమే ఏడుసార్లు సర్వే చేశారని లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు శ్యాంప్రసాద్‌రెడ్డి అడ్డుచెప్పారు. 

మరిన్ని వార్తలు