Teenmar Mallanna: చంచల్ గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తీన్మార్‌ మల్లన్న

8 Nov, 2021 21:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘క్యూ న్యూస్’ ఛానల్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు సోమవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్ గూడ జైలు నుంచి తీన్మార్‌ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఓ జ్యోతి‌ష్యు‌డు కొద్ది రోజుల క్రితం చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్‌ క్రైం పోలీసులు సోదాలు జరిపారు. కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. 
చదవండి: Q News Mallanna: తీన్మార్‌ మల్లన్నపై ఇన్ని కేసులా?

బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్నను ఆగష్టులో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కాగా తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు 38 కేసులు నమోదు అయ్యియి. అందులో 6 కేసులను హైకోర్టు కొట్టివేయగా.. మిగతా 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ మంజూరైంది. అయితే పెండింగ్‌లో ఉన్న చిలకలగూడ కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. తీన్మార్ మల్లన్న రెండు నెలలకు పైగా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం తీన్మార్‌ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు