Telangana MLC Election Results Counting: ఎమ్మెల్సీ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌

14 Dec, 2021 11:58 IST|Sakshi

అప్‌డేట్స్‌:
10: 05 AM
► స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. ఆరు స్థానాలనూ గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది. నల్లగొండలో కోటిరెడ్డి, ఖమ్మంలో తాతా మధు, కరీంనగర్‌-1లో భాను ప్రసాద్‌, కరీంనగర్‌-2లో ఎల్‌. రమణ, ఆదిలాబాద్‌లో దంతె విఠల్‌, మెదక్‌లో యాదవరెడ్డి విజయం సాధించారు.
► మెదక్‌లో జగ్గారెడ్డి సతీమణి నిర్మల ఓటమి పాలయ్యారు.


09: 30 AM
► ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్‌ ఘన విజయం సాధించారు. 

09: 25 AM
► మెదక్‌లోను కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యంలో ఉంది. 
► ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

09: 10 AM
వీరి గెలుపును మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
► నల్లగొండలో టీఆర్ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డి ఘన విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా.. ఆయనకు అధిక ఓట్లు పోలయ్యాయి. కోటిరెడ్డికి 917, స్వతంత్ర అభ్యర్థి నగేష్‌కు 226 ఓట్లు పోలయ్యాయి. కోటిరెడ్డి 691 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
► ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాత మధు గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో 738 ఓట్లు పోలయ్యాయి. దీనిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధుకు 480 ఓట్లను సాధించారు.

08: 10 AM

► నల్లగొండ జిల్లాలో కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్లను సిబ్బంది బండిల్స్‌ కడుతున్నారు.
ఆదిలాబాద్‌ జిల్లాలో టీడీసీ కేంద్రంలో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు.
కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

సాక్షి, హైదరాబాద్‌:  స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్‌ గోయల్‌ ప్రకటించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్ననికల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి.

కౌంటింగ్‌ కోసం ఆదిలాబాద్‌లో 6, నల్లగొండలో 5, మెదక్‌లో 5, ఖమ్మంలో 5, కరీంనగర్‌లో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలుత బ్యాలెట్‌ పేపర్లను 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత లెక్కించనున్నారు. ముందు తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. నల్లగొండ, మెదక్‌లో రౌండ్లు ఎక్కువ ఉంటాయని సీఈఓ తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియలో కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

రెండు డోసుల వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ లేదా ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా అనుమతించనున్నారు. టేబుల్‌కు ముగ్గురు సిబ్బంది ఉంటారు. అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక్కో ఏజెంట్‌ చొప్పున నియమించుకోవచ్చునని గోయల్‌ వివరించారు. లెక్కింపు అనంతరం ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు.

అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత ఓటు వేయకుండా 2, 3 ప్రయారిటీ ఓట్లు వేసినా, అక్షరాలలో రాసినా లేదా క్రాస్‌ మార్కు, రైట్‌ టిక్కు మార్కు పెట్టినా ఓటు చెల్లుబాటు కాదు.

మూడు చోట్ల ఫలితాలపై ఆసక్తి 
మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 9వ తేదీన షెడ్యూల్‌ విడుదలైంది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరింటిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఈ నెల 10న పోలింగ్‌ నిర్వహించారు.

మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక స్థానానికి ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌లో ముగ్గురు బరిలో నిలిచారు. కాగా మూడు స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో క్రాస్‌ఓటింగ్‌ VS జరిగినట్టు చర్చ జరుగుతోంది. 

    

మరిన్ని వార్తలు