తేలేదాకా కదలం

22 Dec, 2021 02:39 IST|Sakshi

లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు హస్తినలోనే: నిరంజన్‌రెడ్డి

రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి  

ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కోరాం. బియ్యం తరలింపుపై అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు రాష్ట్రాన్ని తప్పుబడుతున్నారు. బియ్యం తీసుకునే బాధ్యత పూర్తిగా ఎఫ్‌సీఐ పైనే ఉంటుంది. వారు వ్యాగన్లు పెట్టకుండా, బియ్యం తీసుకోకుండా రాష్ట్రంపై నెపం వేయడం ఏంటి?

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ధాన్యం సేకరణ, బియ్యం తరలింపు అంశాలపై తాడోపేడో తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం సేకరణపై కేంద్రం లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు ఢిల్లీలోనే ఉండాలని, దీనిపై స్పష్టత వచ్చాకే హస్తిన నుంచి కదలాలని రాష్ట్ర మంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు మరో రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. మంగళవారం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అనంతరం తెలంగాణ భవన్‌లో సహచర మంత్రులు, ఎంపీలతో కలిసి నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

ధాన్యం సేకరణపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ కోరామని, ఒకట్రెండు రోజుల్లో చెబుతామని కేంద్రమంత్రి అన్నారని తెలిపారు. బియ్యం తరలింపుపై లోతైన అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు రాష్ట్రాన్ని తప్పుబడుతున్నారని ధ్వజమెత్తారు. బియ్యం తీసుకునే బాధ్యత పూర్తిగా ఎఫ్‌సీఐ పైనే ఉంటుందని, వారు వ్యాగన్లు పెట్టకుండా, బియ్యం తీసుకోకుండా రాష్ట్రంపై నెపం వేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన మంత్రిగా ధాన్యాన్ని కొనిపించే బాధ్యత కిషన్‌రెడ్డికి లేదా? అని నిలదీశారు. రైతుల పక్షాన రాష్ట్రానికి సాయం చేయకుండా అనవసర నిందలు వేస్తున్నారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు