ప్రతిగింజా కొంటామని కిషన్‌రెడ్డి చెప్పలేదా? 

16 Apr, 2022 04:59 IST|Sakshi

ప్రశ్నించిన వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణలో యాసంగిలో పండే బాయిల్డ్, రా రైస్‌ ప్రతి గింజా కొనిపించే బాధ్యత నాది అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పింది నిజంకాదా? వడ్ల కొనుగోళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. కొనిపించే బాధ్యత నాది. అన్నది గుర్తు లేదా? రైతులు వరి సాగు చేయాలని బండి సంజయ్‌ చెప్పింది వాస్తవం కాదా? ఆ తర్వాత రా రైస్‌.. బాయిల్డ్‌ రైస్‌ పేరుతో రాజకీయం చేసింది నిజం కాదా?

ఇప్పుడు ధాన్యం కొనుగోలు మా ఘనత అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా’ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు పలు ప్రశ్నలతో కూడిన ప్రకటన విడుదల చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేతలు ఎప్పుడైనా నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ యాదగిరిగుట్టను రూ.1,200 కోట్లతో పునర్నిర్మించినట్లుగా కనీసం రూ.500 కోట్లు కేంద్రం ద్వారా తీసుకొచ్చి జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయిస్తామని వాగ్దానం చేసే దమ్ముందా? అని మంత్రి సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు