సజ్జల వ్యాఖ్యల వెనుక మోదీ కుట్ర! 

9 Dec, 2022 03:16 IST|Sakshi

అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణపై మోదీ విషం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సహా అవకాశం చిక్కిన ప్రతీ సందర్భంలోనూ అనేకమంది రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజనపై విషం చిమ్మేలా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యల వెనుక ప్రధాని మోదీ కుట్ర ఉందని ఆరోపించారు.

ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలసి గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మాట్లాడిన మోదీ దన్నుతోనే గతంలో చంద్రబాబు, ప్రస్తుతం సజ్జల మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బీజేపీ కేఏపాల్‌తో సహా అనేక బాణాలను వదులుతోందన్నారు.  ఏపీలో తెలంగాణను విలీనం చేస్తారనే మాటలు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏ విషయంపైనా అవగాహన లేదని, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు బీజేపీతో పాటు గవర్నర్‌ కూడా శిక్షణ ఇస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. 

మరిన్ని వార్తలు