సెంటర్‌ షేకైపోవాలి!

29 Jan, 2022 01:15 IST|Sakshi

విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు టీఆర్‌ఎస్‌ కసరత్తు

ఆదిలాబాద్‌ సీసీఐ పునరుద్ధరణకు సాధన సమితి ఏర్పాటు

బయ్యారం స్టీల్‌ప్లాంటు కోసం ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం

రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ మంజూరులో జాప్యంపై నేడు కాజీపేటలో అఖిలపక్షం ధర్నా

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తిప్పికొట్టేందుకు జాతీయ సదస్సు నిర్వహణకు నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రంపై పోరాడుతున్న అధికార టీఆర్‌ఎస్‌ తమ ఆందోళనలను ఉధృతం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు దీనిపై కేంద్రానికి లేఖాస్త్రాలు సంధిస్తుండగా ఇకపై క్షేత్రస్థాయి పోరాటాలకు అవసరమైన కార్యాచరణ కోసం పదును పెడుతోంది. 

సీసీఐ కోసం ఒత్తిడి పెంచేలా... 
సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదిలాబాద్‌ యూనిట్‌ పునరుద్ధరణకు పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న మంత్రి కేటీఆర్‌ ఈ అంశంపై మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో పార్టీ నేతలు, జిల్లా ప్రముఖులతో తాజాగా చర్చించారు. ‘సీసీఐ సాధన సమితి’గా ఏర్పడి కేంద్రంపై ఉద్యమించేందుకు కార్యాచరణ  మొదలు పెట్టా లని ఈ సమావేశంలో నిర్ణయించారు.

బయ్యారం స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు డిమాండ్‌తో టీఆర్‌ఎస్‌ నేతలు శుక్రవారం మహబూబాబాద్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇక కాజీపేటలో రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిం చినా కేంద్రం మంజూరు చేయడం లేదు. దీనిపై కేంద్రం వైఖరిగా నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శనివారం కాజీపేటలో ధర్నా చేయనుంది.  సోమవారం సికింద్రాబాద్‌ రైల్వే జీఎం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనుంది. 

ప్రభుత్వరంగ సంస్థల అప్పగింతపైనా పోరు 
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కేం ద్రం ప్రయత్నిస్తోందంటూ టీఆర్‌ఎస్‌ ఇప్పటి కే పలు సందర్భాల్లో నిరసన వ్యక్తం చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, బీడీఎల్, హెచ్‌ఏఎల్, డీఆర్‌డీఎల్, ఈసీఐల్, తపాలా, బీమా, బ్యాంకింగ్‌ తదితర రంగాలనూ కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకు మోదీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని దుయ్యబడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ ఇటీవల సమా వేశమై కేంద్రం విధానాలకు నిరసనగా జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. 

బీజేపీ ఎంపీలను ఇరుకునపెట్టేలా... 
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నా ఇక్కడి నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు తమతో కలసి రావడం లేదని టీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో కేంద్రంతో పాటు రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు విఫలమవుతున్నారనే అంశా న్ని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాల ద్వారా ఎత్తిచూపాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.   

మరిన్ని వార్తలు