ఇక్కడ కొనకుండా అక్కడ దొంగ దీక్షలా?

12 Apr, 2022 02:05 IST|Sakshi
రైతుదీక్షలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల 

వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల

గార్ల/బయ్యారం: రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోలు చేయకుండా సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి దొంగ దీక్షలు చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల, బయ్యారం మండలాల్లో సోమవారం ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గార్ల మండలం పెద్దకిష్టాపురం గ్రామంలో రైతుదీక్షలో షర్మిల మాట్లాడారు. యాసంగిలో వరి పంట సాగు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో, 17 లక్షల ఎకరాలను బీళ్లుగా వదిలేసిన రైతుల ఉసురు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగులుతుందన్నారు.

విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీని సాధించకుండా బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటు విషయంలో కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం మండలంలోని నారాయణపురం పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్వర్లు పంచాయతీ అభివృద్ధికోసం అప్పు తెచ్చి పనులు చేయాల్సి వచ్చిందని, ఆ అప్పును తీర్చే పరిస్థితి లేక చివరకు ప్రాణం తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఇదే బయ్యారానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్‌ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదన్న ఆవేదనతో రైలుకింద పడి మృతి చెందాడని, అయినా ప్రజా సమస్యలపై కేసీఆర్‌ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు