రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు 

18 Oct, 2022 01:10 IST|Sakshi
గిరిజన మహిళలతో నృత్యం చేస్తున్న వైఎస్‌ షర్మిల 

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల 

డిచ్‌పల్లి/నిజామాబాద్‌ నాగారం: బంగారంలాంటి తెలంగాణను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశారని, ఖజానాను ఖాళీచేసి దేనికీ డబ్బుల్లేవని అంటున్నారని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ అక్రమాలను బీజేపీ, కాంగ్రెస్‌ సైతం ప్రశ్నించడంలో విఫలమైయ్యాయని, అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలని ఆమె విమర్శించారు.

రాష్ట్రంలో ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమ వారం బోధన్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో సా గింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..రాష్ట్రంలోని కేసీఆర్‌ చేతిలో మోసపోని వర్గం లేదన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికలుంటేనే బయటకు వస్తారని విమర్శించారు. రైతుబంధు పేరిట రూ.5 వేలు ముష్టి ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరలేదని, రుణమాఫీ కాక రైతును బ్యాంకుల వద్ద డీఫాల్టర్‌గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాజెక్ట్‌ల పేరిట లక్షల కోట్లు దోచుకుని ఆ డబ్బుతో విమానాలు కొనడం, జాతీయ పార్టీలు పెట్టడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ అరాచకాలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఫిర్యాదు చేసింది వైఎస్సార్‌టీపీ అని తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో వైఎస్సార్‌ సంక్షేమ పాలన మళ్లీ తిరిగి తీసుకువస్తామని హామీనిచ్చారు. 

>
మరిన్ని వార్తలు