జాకీని అడ్డుకుంది అప్పటి  పప్పు, తుప్పు మంత్రులే

22 Nov, 2022 04:28 IST|Sakshi

పేజ్‌ ఇండస్ట్రీస్‌కు టీడీపీ హయాంలో అనేక రాయితీలిచ్చారు 

రూ. 140 కోట్ల భూమిని రూ.2.80 కోట్లకే ఇచ్చారు 

ఈనాడు అసత్య కథనంపై ఎమ్మెల్యే తోపుదుర్తి ధ్వజం

అనంతపురం: జాకీ ఇంటర్నేషనల్‌ కంపెనీని అడ్డుకున్నది అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పప్పు, తుప్పు మంత్రులేనని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వెళ్లిపోయిన సంస్థతో తనకు ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఎక్కడ జాకీ, ఎవరి జాకీ, ఎక్కడుంది జాకీ? ఈ సంస్థకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కటైనా నిర్మాణం జరిగిందా’ అని ప్రశ్నించారు. 

అదో దోపిడీ ఒప్పందం 
‘జాకీ దుస్తులు ఉత్పత్తి చేసే పేజ్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థకు టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.140 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.2.80 కోట్లకే ఇచ్చారు. 2017లో భూమి కేటాయించి 2018లో సేల్‌ డీడ్‌ చేశారు. మూడేళ్లు నడిపితే సేలబుల్‌ రైట్స్‌ ఇచ్చారు. వారు ఉద్యోగాలు కూడా దశలవారీగా ఇస్తామన్నారు. తొలుత వెయ్యి మందికి, మూడేళ్లకు రెండు వేల మందికి, ఆ తర్వాత దశలవారీగా 6 వేలమందికి ఉపాధి కల్పిస్తామని డీపీఆర్‌లో చెప్పారు.

ఈ ఫ్యాక్టరీకి విద్యుత్తు సరఫరా, తాగు నీటి సదుపాయానికి కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అంతేకాకుండా క్యాపిటల్‌ సబ్సిడీ దాదాపు రూ.15 కోట్లు ఇచ్చేలా, వడ్డీ సబ్సిడీ ఆరు శాతం ఏడేళ్ల పాటు.. అంటే రూ.42 కోట్లు, భూమికి రూ.130 కోట్లు, ఇవి కాకుండా వారు చెబుతున్న ప్రకారం 6 వేల మంది ఉద్యోగుల జీతాలపై సబ్సిడీ ఏడేళ్లకు రూ. 130 కోట్లు కలిపి మొత్తం రూ.300 కోట్లకు పైగా దోచిపెట్టేలా ఒప్పందం జరిగింది.

తీరా చూస్తే ఆ ప్రాజెక్ట్‌ విలువ కేవలం రూ.40 కోట్లే. దాని డీపీఆర్‌ పెంచుకుని రూ.300కోట్లు దోచుకోవాలని పన్నాగం పన్నారు. ఆ సంస్థ 2017లో సివిల్‌ పనులు ప్రారంభించి, 2018 ఆగస్టు నాటికి ఫ్యాక్టరీ, బిల్డింగ్‌లు పూర్తి చేసి, 2018 అక్టోబరులో ఉత్పత్తి చేస్తామన్నారు. ఇంత హడావుడిగా షెడ్యూలు ఇచ్చిన ఆ సంస్థ ఎందుకు ఉత్పత్తి ప్రారంభించలేదు? బేరాలు కుదరలేదా?’ అని ప్రకాష్‌రెడ్డి అన్నారు.

‘ఆరోజు పప్పు మంత్రి నారా లోకేష్, తుప్పు మంత్రి పరిటాల సునీత చీకటి ఒప్పందం చేసుకున్నారు. తుప్పు మంత్రి కొడుకు, తమ్ముడు పోటీ పడి జాకీ కంపెనీ కాంపౌండ్‌ వాల్‌ నిర్మించాలని అనుకున్నారు. వారిద్దరూ కలిసి 2018 జూన్‌లో వంద మీటర్ల పనులు ప్రారంభించారు. మధ్యలోనే ఆపేశారు. హిందూపురంలో పది ఎకరాల్లో టెక్సో్పర్ట్‌ వచ్చింది. వారికి ప్రైమ్‌ ల్యాండ్‌ ఇవ్వలేదే? ఇక్కడేమో జాకీకి ప్రైమ్‌ ల్యాండ్‌ ఇచ్చారు. అయినా ఎందుకు రాలేదు?  మీ చేతగానితనానికి మాపై విమర్శలు చేస్తారా’  అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు